Share News

YCP flags : బరితెగించారు!

ABN , First Publish Date - 2023-11-10T03:32:48+05:30 IST

‘ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే’ కార్యక్రమంలో భాగంగా గ్రామ సచివాలయాల వద్ద వైసీపీ జెండాను ఎగురవేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నిర్వహించిన

YCP flags : బరితెగించారు!

సచివాలయాల ముందర వైసీపీ జెండా ఆవిష్కరణలు

కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ అధికారులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

‘ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే’ కార్యక్రమంలో భాగంగా గ్రామ సచివాలయాల వద్ద వైసీపీ జెండాను ఎగురవేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికారులు పాల్గొనడం విమర్శలకు తావిచ్చింది. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణం పట్టు పరిశ్రమల కార్యాలయ ఆవరణలో ఉన్న ఒకటో సచివాలయం ముందు జాతీయ జెండా ఎగురవేసే దిమ్మెపై ప్రభుత్వ అధికారుల సమక్షంలో పార్టీ నాయకులతో కలసి పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ వైసీపీ జెండాను ఎగురవేశారు. ప్రభుత్వ కార్యక్రమం అని చెబుతూనే.. పార్టీ జెండాను ఎగురవేయడం, అందులోనూ జాతీయ జెండా ఆవిష్కరణకు ఉపయోగించే స్తంభాన్ని వాడుకోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతహిరమండలం సచివాలయం వద్ద వైసీపీ జెండాను కార్యకర్తలు, అధికారులతో కలసి ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆవిష్కరించారు. కొన్నిచోట్ల సచివాలయ సిబ్బంది, ఎంపీడీవోలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో వివిధ సంక్షేమ పథకాలు పొందిన వారు 8వేల మంది వరకు ఉన్నా ఈ కార్యక్రమానికి వంద మందిలోపే హాజరయ్యారు. విజయనగరంలో 1వ డివిజన్లో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొనగా, జనాలు లేక కుర్చీలు ఖాళీగా కన్పించాయి. బొబ్బిలి పట్టణం 2వ సచివాలయం పరిధిలో కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడును ఉద్యోగాలు కావాలని యువత కోరారు. తాగునీటి సమస్యను పరిష్కరించడం లేదని మహిళలు నిరసనగళం వినిపించారు.

డాక్ట ర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం తాడికోన పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్‌ సాధనాల సూర్యవెంకట నాగమణి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, వైసీపీ మండల అధ్యక్షుడు కొనుకు బాపూజీ ఆధ్వర్యంలో నాయకులు తాడికోన పెదపేట దళితవాడలో వైసీపీ జెండా ఆవిష్కరణకు సిద్ధమయ్యారు. తాడికోన దళితవాడకు, శ్మశానవాటికకు రోడ్ల గురించి మంత్రి విశ్వరూప్‌ పట్టించుకోలేదని, ఆర్టీసీ బ స్సు సక్రమంగా రావట్లేదంటూ వైసీపీకి చెందిన అక్కడి దళితులు జెండా ఆవిష్కరణను అడ్డుకున్నారు. ఘర్షణ, వాగ్వివాదాల తర్వాత జెండాను ఆవిష్కరించారు. బాపట్ల జిల్లా మార్టూరులో పార్టీ జెండా ఆవిష్కరణ ప్రదేశం దేవాలయానికి సమీపంలో ఉండడంతో ప్రజలు అభ్యంతరం తెలిపారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు సచివాలయం వద్ద ‘పల్లెకు పోదాం..’ కార్యక్రమంలో ఎంపీడీవో, ఈవోపీఆర్‌డీ, పంచాయతీ సెక్రటరీ పాల్గొన్నారు. వైసీపీ కార్యక్రమంలో అధికారులు పాల్గొనడమేంటని స్థానికులు నిలదీశారు. ఈ విషయంపై ఎంపీడీవో దారపు శ్రీనివా్‌సను వివరణ ఇస్తూ... ఇది ప్రభుత్వ పథకాల అమలు గురించి ప్రజలకు వివరించే కార్యక్రమమని తెలిపారు.

Updated Date - 2023-11-10T03:32:49+05:30 IST