మహిళలకు మూత్రశాల లేదు మేడం!

ABN , First Publish Date - 2023-06-10T04:33:46+05:30 IST

‘‘దేశంలోని ప్రార్థనామందిరాల గురించి వివిధ వేదికలు, టీవీ స్టూడియోల్లో రోజూ చర్చలు, వాదనలు చేస్తుంటారు. కానీ, ఆ ప్రార్థనామందిరాల దగ్గర మూత్రశాల ఉన్నదా లేదా అనేది మాత్రం ఎవరికీ పట్టదు’’... కర్ణాటకకు చెందిన ఓ మహిళ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలోని ఒక భాగమిది.

మహిళలకు మూత్రశాల లేదు మేడం!

మీరు రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ మాకిదేం దుస్థితి?

మతాలతో సంబంధం లేని వసతి.. వాష్‌రూమ్‌

గుళ్లపై వాదనలు చేసేవారికి ఇది మాత్రం పట్టదు

రాష్ట్రపతి ముర్ముకు కర్ణాటకకు చెందిన ఓ మహిళ లేఖ

దత్తపీఠం సందర్శనలో ఎదురైన చేదు అనుభవం ఏకరువు

బెంగళూరు, జూన్‌ 9 : ‘‘దేశంలోని ప్రార్థనామందిరాల గురించి వివిధ వేదికలు, టీవీ స్టూడియోల్లో రోజూ చర్చలు, వాదనలు చేస్తుంటారు. కానీ, ఆ ప్రార్థనామందిరాల దగ్గర మూత్రశాల ఉన్నదా లేదా అనేది మాత్రం ఎవరికీ పట్టదు’’... కర్ణాటకకు చెందిన ఓ మహిళ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలోని ఒక భాగమిది. మతాలు, కులాలతో సంబంధం లేకుండా అందరికీ మూత్రశాల అత్యవసరమైన వసతి అని వ్యాఖ్యానించారు. ఆలయాల వద్ద మూత్రశాల లేని కారణంగా భక్తులు, అందులోనూ ముఖ్యంగా మహిళలు పడుతున్న బాధలను వివరిస్తూ బళ్లారికి చెందిన జాదెమ్మ (52) అనే మహిళ ఈ లేఖను రాశారు. కర్ణాటకలోని చిక్‌మంగళూరులోని దత్తాత్రేయ పీఠాన్ని (బాబా బుడంగిరి హిల్స్‌) సందర్శించినప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆ లేఖలో ఆమె రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు. మహిళల కష్టాలను తోటిమహిళగా మీరే అర్థం చేసుకోవాలంటూ ఆ లేఖలో అభ్యర్థించారు. ‘‘ఇటీవల నేను కొన్ని హిందూ ప్రార్థనా స్థలాలను సందర్శించాను. ఇందులో భాగంగా చిక్‌మంగళూరులోని దత్తపీఠం ప్రాంగణంలోని బాబా బుడంగిరి, మల్లయ్యనగిరి, సీతాలయ్యనగిరి కొండలకు వెళ్లారు.

బాబా బుడంగిరి పీఠాన్ని దర్శించుకుంటుండగా నాకు అర్జంటుగా వాష్‌రూమ్‌ అవసరమైంది. చుట్టుపక్కల ఎక్కడా నాకు మూత్రశాల కనిపించలేదు. మల్లయ్యనగిరి కొండపై చూద్దామని ఆశగా పైకి ఎక్కివెళ్లాను. ఎంత వెతికినా కనిపించలేదు. ఈ క్రమంలో వాష్‌రూమ్‌ అవసరం మరింత మరింత పెరగడం మొదలైంది. అక్కడనుంచి సీతాలయ్యనగిరి కొండ మెట్లను వడివడిగా ఎక్కాను. అక్కడా మూత్రశాల వసతి కనిపించలేదు. నా పరిస్థితి ఏమని చెప్పాలి? తప్పనిపరిస్థితుల్లో బహిరంగ ప్రదేశంలోనే వాష్‌రూమ్‌ అవసరం తీర్చుకోవాల్సి వచ్చింది. చెప్పుకొంటే సిగ్గుచేటు. కాని తప్పలేదు మేడం’’ అని ఆ లేఖలో తెలిపారు. రాష్ట్రపతి హోదాలో ఒక మహిళ ఉన్న దేశంలోనే ఈ పరిస్థితి ఉండటం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘మంచి హోదా ఉన్న మీవంటివారికి ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావు. పనులుచేసి పెట్టడానికి నౌకర్లు, చాకర్లు దండిగా ఉంటారు. కానీ సామాన్య మహిళల పరిస్థితి ఏమిటి? ఆమె ఆ లేఖలో వాపోయారు. ‘‘మత వివాదాలు, ధార్మిక చర్చల్లో రోజూ అందరూ మునిగితేలుతుంటారు. కానీ.. ఒక్క వాష్‌రూమ్‌ కట్టించాలని మాత్రం ఏ ఒక్కరికీ అనిపించదు. ఇది దేశంలోని మహిళలు చేసుకున్న దురదృష్టం. వాష్‌రూమ్‌ అవసరం వచ్చినప్పుడు మతాలు,కులాలు చూడరు. ముందు ఆ అవసరం తీర్చుకోవాలని మాత్రమే చూస్తారు. ఏ పట్టింపులు లేని వసతి అదొక్కటే’’ అని ఆ లేఖలో జాదెమ్మ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే మధుమేహులు అత్యధికంగా ఉన్న దేశం మనదనేదీ జ్ఞప్తిలో ఉండాలని పేర్కొన్నారు. కాగా, కర్ణాటకలో వాష్‌రూమ్‌లలేమి దయనీయంగా ఉన్నదని, దీనివల్ల పర్యాటన ప్రదేశాలను చూడటానికి వచ్చే విదేశీయుల ముందు మన పరువు పోతోందని ప్రియా అనే పర్యాటకురాలు.. రాష్ట్రపతికి రాసిన మరో లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-06-10T04:33:46+05:30 IST