పేదల సంక్షేమం కోసం హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర

ABN , First Publish Date - 2023-01-26T23:25:14+05:30 IST

ప్రజల సంక్షేమం కోసమే హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర చేపట్టానని, తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం రావాలంటే...మొదటగా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కుటుంబంలో ఉద్యోగాలను ఊడగొట్టాలని టీపీసీసీ చీఫ్‌, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

పేదల సంక్షేమం కోసం హాత్‌ సే హాత్‌ జోడో  యాత్ర

టీపీసీసీ అధ్యక్షుడు ఏ.రేవంత్‌రెడ్డి

బొంరా్‌సపేట్‌/ కొడంగల్‌ రూరల్‌, జనవరి 26: ప్రజల సంక్షేమం కోసమే హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర చేపట్టానని, తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం రావాలంటే...మొదటగా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కుటుంబంలో ఉద్యోగాలను ఊడగొట్టాలని టీపీసీసీ చీఫ్‌, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. భారత్‌ జోడో యాత్రకు అనుబంధంగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ను గురువారం బొంరాస్‌పేట మండల పరిధిలోని మదన్‌పల్లి గ్రామంలో ప్రారంభించారు. గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం దుద్యాల్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధీ చేపట్టిన పాదయాత్ర స్ఫూర్తితో రాష్ట్రంలో హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ చేపట్టినట్లు తెలిపారు. పేద ప్రజల కోసం అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రానికి దిశ నిర్ధేశం చేసే స్థాయిలో తాను ఉన్నానంటే కొడంగల్‌ ప్రజలే కారణం అని గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే..

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మీ పథకాలను మరింత అధికం చేసి కొనసాగిస్తామన్నారు. పింఛన్‌ అర్హులందరికీ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకాలు ఎప్పటికీ రద్దు కావు, బీఆర్‌ఎస్‌ నాయకుల మాటలు నమ్మరాదన్నారు. 2009లో తనకు అవకాశం కల్పిస్తే కొడంగల్‌ నియోజకవర్గంలో 50 ఏళ్ల వెనకబాటుతనాన్ని దూరం చేశానన్నారు. ఇక్కడి విద్యార్థులకు విద్య కోసం పాఠశాలలు, దాహార్తిని తీర్చేందుకు గ్రామాల్లో నీటి ట్యాంకులు, విద్యుత్‌ సమస్య పరిష్కారం కోసం సబ్‌స్టేషన్‌ల ఏర్పాటు, రైతులకు లో ఓల్టేజీ సమస్యను తీర్చేందుకు 2వేల ట్రాన్స్‌ఫార్మర్‌లను మంజూర్‌ చేయించడం జరిగిందన్నారు.

రైతులతో మాటామంతి

హాత్‌ సే హాత్‌ జోడో కార్యక్రమంలో భాగంగా బొంరా్‌సపేట్‌ మండలంలో పర్యటించిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మదన్‌పల్లి నుంచి వస్తూ పొలాల్లో రైతు కూలీలతో మాట్లాడారు. వేరుశనగ తీస్తున్న రైతులు, కూలీలతో మాట్లాడుతూ పంటలు ఎలా పండాయి, గిట్టుబాటు ధర లభిస్తుందా అని అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే అన్నీ చర్యలు తీసుకుంటుందని భరోసా కల్పించారు. హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ యాత్రకు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మదన్‌పల్లి నుంచి ప్రారంభమైన యాత్రలో భాగంగా ఆంజనేయస్వామి, పోలెపల్లి ఎల్లమ్మ , కొడంగల్‌ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చౌరస్తా మీదుగా కొడంగల్‌ లోఅంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ నాయకులు నర్సింహులుగౌడ్‌, రాజేశ్‌రెడ్డి, జయకృష్ణ, వెంకట్రాములుగౌడ్‌, రాంచంద్రారెడ్డి, అంజిల్‌రెడ్డి, మెరుగు వెంకటయ్య, ఆవుటి శేఖర్‌, దేశ్యనాయక్‌, నర్సిములునాయుడు, మల్లికార్జున్‌, పోలెపల్లి నర్సింహా, టీపీసీసీ ప్రతినిధి ఎండీ.యూసుఫ్‌, పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్‌, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ ఆనంద్‌రెడ్డి, నయీం, దాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T23:25:16+05:30 IST