Share News

MLC: ఎమ్మెల్సీ భరత్‌ కనబడుటలేదు

ABN , Publish Date - Oct 21 , 2024 | 01:27 AM

వైసీపీకి చెందిన చిత్తూరు ఎమ్మెల్సీ కేజేఆర్‌ భరత్‌ ఎన్నికల తర్వాత కుప్పంలో కనిపించక పోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు.

MLC: ఎమ్మెల్సీ భరత్‌ కనబడుటలేదు
సోషల్‌ మీడియాలో పోస్టు

కుప్పం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): వైసీపీకి చెందిన చిత్తూరు ఎమ్మెల్సీ కేజేఆర్‌ భరత్‌ ఎన్నికల తర్వాత కుప్పంలో కనిపించక పోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కుప్పం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొద్దిరోజులు తప్ప కుప్పంలో లేరు. సొంతూరు హైదరాబాదుకు వెళ్లిపోయారు. స్థానికంగా పార్టీకి నాయకత్వం వహించేవారు లేకపోవడంతో అసహనానికి గురైన వైసీపీ కార్యకర్తలు.. ‘ఎమ్మెల్సీ భరత్‌ మాకు కనిపించడంలేదు. ఆచూకీ తెలిసినవారు మాకు తెలియజేయగలరు- కుప్పం నియోజకవర్గ కార్యకర్తలు’ అని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ‘కనబడుటలేదు’ అన్న శీర్షికతో ఉన్న ఈ పోస్టుల్లో, ‘పేరు: భరత్‌ ఎమ్మెల్సీ, వయసు: 35’ అని కూడా స్పష్టంగా రాశారు. నిన్నమొన్నటిదాకా వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కూడా అయిన భరత్‌ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అపరిమిత అధికారం అనుభవించారు. తన సామాజిక వర్గంలోనే కొందరిలో ఆయనపట్ల అప్పట్లో తీవ్ర వ్యతిరేకత ఉండేది. ఇపుడు ప్రతిపక్షంలో వచ్చిన సమయంలో తమకు అండగా ఉండకుండా సొంత ప్రాంతానికి వెళ్లిపోవడంపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తపరిచారు.

Updated Date - Oct 21 , 2024 | 01:27 AM