Share News

CM Chandrababu: జీవో జారీపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం.. లీకేజీపై విచారణకు ఆదేశం

ABN , Publish Date - Jul 15 , 2024 | 07:34 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీపీఎస్‌పై జీవో రిలీజ్ చేసిందని.. రెండ్రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై స్వయంగా సీఎం నారా చంద్రబాబు స్పందించి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి..

CM Chandrababu: జీవో జారీపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం.. లీకేజీపై విచారణకు ఆదేశం

అమరావతి: జీపీఎస్.. గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ చట్టం అమలుపై వచ్చిన జీవో విషయంలో గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. జీపీఎస్‌ను అమలు చేస్తూ ప్రభుత్వం గెజిట్ రిలీజ్ చేసిందని వార్తలు గుప్పుమన్నాయి. ఈ జీవో వ్యవహారంపై తొలిసారి ఏపీ ప్రభుత్వం స్పందించింది. సోమవారం నాడు జరిగిన ఆర్ధికశాఖ సమీక్షలో గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ గెజిట్ జారీకావడంపై స్వయంగా చంద్రబాబే (CM Chandrababu) ఆరా తీశారు. గత ప్రభుత్వ ప్రతిపాదనలతో నేటి ప్రభుత్వంలో ఉత్తర్వులు ఇవ్వడంపై సీఎం తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండా గెజిట్ బయటికి ఎలా వచ్చింది..? ఎవరు లీక్ చేశారు..? ఎందుకు లీక్ చేయాల్సి వచ్చింది..? ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారు..? అనే అంశంపై విచారణ చేయాలని ఆర్థిక అధికారులను చంద్రబాబు ఆదేశించారు.


అసలేం జరిగింది..?

ఇటీవల జీపీఎస్ రిలీజ్ అయిన జీవోతో ఒక్కసారి వివాదం రాజుకుంది. 2023 అక్టోబర్-10 నుంచి జీపీఎస్ అమలులోకి వస్తుందంటూ ఆదేశాలు రావడంతో ఉద్యోగులు నివ్వెరపోయారు. గత నెల 12న నాటి ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రావత్ ఈ జీవోను జారీ చేయడం జరిగింది. కాగా.. ఈ జీవో గతంలోని వైసీపీ ప్రభుత్వంలోనే వచ్చింది. అయితే.. తమకు తెలియకుండానే ఈ చట్టం అమలులోకి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. కూటమి అధికారంలోకి వచ్చేటప్పటికే రావత్ సెలవులో ఉన్నారని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. దీంతో ఈ చట్టంపై సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొనగా.. ఇవాళ్టితో ఆ ఉత్కంఠకు తెరపడింది.


ఆ తర్వాత ఇలా..!

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన జూన్‌ 12వ తేదీన.. జీపీఎస్‌ విధానం 2023 అక్టోబరు 20 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంటూ ఆర్థిక శాఖ జీవో ఇచ్చింది. ఆ రోజున కీలక బాధ్యతల్లో ఉన్నది వైసీపీ అనుకూల అధికారులే. అప్పటికి కూటమి ప్రభుత్వం ఐఏఎస్‌లను బదిలీ చేయలేదు. జూలై 12వ తేదీన అదే జీవో గెజిట్‌లో ప్రచురితమైంది. పాత తేదీతో కొత్త ప్రభుత్వంలో జీవో రావడంతో ఉద్యోగుల్లో కలకలం రేగింది. పలు ఉద్యోగ సంఘాలు దీనిని వ్యతిరేకించాయి. అయితే ఇది రొటీన్‌గా జరిగిపోయిందని, ఇందులో ఎలాంటి కుట్రా లేదని ఆర్థిక శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులంతా పాత పెన్షన్‌ విధానం కావాలని ఆకాంక్షిస్తుంటే, పాత తేదీతో జీపీఎస్‌ అమలుకు గెజిట్‌ జారీచేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Updated Date - Jul 15 , 2024 | 11:53 PM