Share News

Varla Ramaiah: టీటీడీలో చాలా అవినీతికి పాల్పడ్డారు.. వైసీపీపై వర్ల రామయ్య సంచలన విమర్శలు

ABN , Publish Date - Sep 20 , 2024 | 10:46 PM

జగన్ పాలనలో టీటీడీలో చాలా అవినీతికి పాల్పడి అందినంత దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. వెంకటేశ్వర స్వామివారి పట్ల జగన్ చేసిన నికృష్ట కార్యానికి హైందవ భక్తులందరూ భగ్గుమంటున్నారని చెప్పారు.

Varla Ramaiah: టీటీడీలో చాలా అవినీతికి పాల్పడ్డారు.. వైసీపీపై వర్ల రామయ్య సంచలన విమర్శలు

అమరావతి: జగన్ పాలనలో టీటీడీలో చాలా అవినీతికి పాల్పడి అందినంత దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. వెంకటేశ్వర స్వామివారి పట్ల జగన్ చేసిన నికృష్ట కార్యానికి హైందవ భక్తులందరూ భగ్గుమంటున్నారని చెప్పారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రపంచ వ్యాప్తంగా అందరి వేళ్లూ జగన్ వైపు చూపిస్తుంటే కంగారులో మీడియా సమావేశం పెట్టి చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తడం ఆయన చేస్తున్న డైవర్ట్ పాలిటిక్స్ అని వర్ల రామయ్య మండిపడ్డారు.


జగన్‌‌ది అవినీతి పరిపాలన..

‘‘జగన్‌ది అవినీతి పరిపాలన, చంద్రబాబుది ధర్మ పాలన. నీ పాలనలో అష్టకష్టాలు, చంద్రబాబు 100 రోజుల పాలనతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. చంద్రబాబుది డైవర్షన్ పాలిటిక్స్ అని జగన్ నోటికొచ్చినట్లు మాట్లాడటం సబబుకాదు. వెంకటేశ్వర స్వామివారితో పెట్టుకుంటే బతికి బట్టకట్టలేరనే విషయం జగన్‌కు కూడా బాగా తెలుసు’’ అని వర్ల రామయ్య అన్నారు.


జగన్‌ బహిరంగ చర్చకు రావాలి...

‘‘తిరుపతి లడ్డూల్లో వాడే నెయ్యి కల్తీపై సమాధానం చెప్పకుండా చంద్రబాబు పాలన సరిగా లేదనడం అర్థంలేని మాట. దొంగే దొంగ, దొంగ అని అరచినట్లుంది జగన్ తీరు. మీ 100 రోజుల పరిపాలన, మా 100 రోజుల పరిపాలనపై సవాల్ విసురుతున్నాను బహిరంగ చర్చకు జగన్ రావాలి. బాలీవుడ్ నటి జత్వానీ కేసులో ఐపీఎస్‌లపై చర్యలు తీసుకున్నాం. దీన్ని డైవర్ట్ చేయడానికి అనడం అవివేకం. ఎస్ఐ ఛేదించాల్సిన జత్వానీ కేసును డీఐజీ ఇన్వెస్టిగేషన్‌కు.. అదీ విమానంలో వెళ్లడాన్ని మీరు సమర్థిస్తారా? జగన్! ప్రపంచమే పొగిడిన రామోజీరావులాంటి వ్యక్తిని మీరు కించపరుస్తారా? డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్య విధానానికి ఆ పేరు తీసేసి నువ్వు ఉగ్రవాదివి అనిపించుకున్నావ్. మీ మొదటి 100 రోజుల పాలనలో కేవలం 250 రూపాయలు పెన్షన్ పెంచడం తప్ప ఏమీ చేయలేదు. చంద్రబాబు మొదటి రోజునే వెయ్యి రూపాయలు పెంచి పాత బకాయితో సహా ఇచ్చిన ఘనత ఆయనది. వృద్ధుల కళ్లల్లో చంద్రబాబు ఆనందం చూశారు’’ అని వర్ల రామయ్య తెలిపారు.


వైవీ సుబ్బారెడ్డి బాక్సైట్ మాఫియా నడిపారు...

‘‘బమిడిపల్లిలో అక్రమంగా బాక్సైట్ మాఫియా నడిపిన వైవీ సుబ్బారెడ్డిని విశిష్టమైన భక్తిపరుడని జగన్ పేర్కొనడం విడ్డూరంగా ఉంది. టీటీడీలో కరుణాకర్ రెడ్డి అనే నాస్తికుడిని ఛైర్మన్‌గా పెట్టడం విడ్డూరం. ఆయన ఏరకంగా విశిష్ట వ్యక్తో జగన్ హైందవ భక్తులకు చెప్పాలి. టీటీడీ ఈవోగా చేసిన ధర్మారెడ్డి కూడా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం జాగ్రత్తపడాలి. అమెరికాలోని శ్వేత సౌధానికి ధీటైన బెంగుళూరులోని జగన్ ప్యాలెస్‌ను చూసుకునే వ్యక్తికి టీటీడీ బాధ్యతలు అప్పగించడంతో ఆయన ఏ విధంగా విశిష్ట వ్యక్తి అవుతాడో తెలపగలరా? కల్తీ నెయ్యి కుంభకోణంలో స్వామి ఆగ్రహానికి గురవుతున్నానని భయపడి నేడు జగన్ హడావుడిగా మీడియా సమావేశం పెట్టారు. రాష్ట్రంలో కల్తీ సారా తెచ్చినట్లు.. కల్తీ నెయ్యితో తిరుపతి లడ్డూలు చేసి తిరుపతి పవిత్రతను అభాసుపాలు చేశారు. కల్తీ నెయ్యి కేసులో దోషి జగనే, కనుక కోట్లాది హైందవ భక్తుల వేళ్లన్నీ ఆయన వైపే చూపిస్తున్నాయి’’ అని వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు.

Updated Date - Sep 20 , 2024 | 11:21 PM