Granit కొండ పిండి..!
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:02 AM
గ్రానైట్ మాఫియాకు అడ్డూఅదుపు లేకపోవడంతో చెలరేగిపోతోంది. ప్రభుత్వ అనుమతులు లేకపోయినా, రాయల్టీలు చెల్లించకపోయినా కొండను కొల్లకొడుతున్నారు. బహిరంగంగా పెద్దఎత్తున గ్రానైట్ మాఫియా ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు.

గ్రానైట్ మాఫియా ఇష్టారాజ్యం
చోద్యం చూస్తున్న అధికారులు
బుక్కపట్నం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): గ్రానైట్ మాఫియాకు అడ్డూఅదుపు లేకపోవడంతో చెలరేగిపోతోంది. ప్రభుత్వ అనుమతులు లేకపోయినా, రాయల్టీలు చెల్లించకపోయినా కొండను కొల్లకొడుతున్నారు. బహిరంగంగా పెద్దఎత్తున గ్రానైట్ మాఫియా ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు. బుక్కపట్నం మండలంలోని అగ్రహారం గ్రామ రెవెన్యూ పొలం సర్వే నంబరు 809-7లో గత ఎనిమిదేళ్లుగా గ్రానైట్ను అక్రమంగా తోలుతున్నారు. చిలకలగడ్డపల్లి, రెడ్డిపల్లి గ్రామాల మధ్య రోడ్డు పక్కనే రిజర్వు పారెస్టుకు ఆనుకుని ఈ దోపిడీ కొనసాగుతోంది. రోజుకు 10 వాహనాలలో గ్రానైట్ను అక్కడి నుంచి తరలిస్తున్నారు. గ్రానైట్ను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎనిమిదేళ్ల నుంచి దాదాపు రూ.20 కోట్ల విలువ చేసే ప్రభుత్వ సంపదను దోచుకున్నట్టు తెలుస్తోంది. పాముదుర్తి గ్రామానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు ఈ తతంగాన్ని ముందుండి నడిపిస్తున్నట్టు సమాచారం. సమీప గ్రామాల ప్రజలకు అనుమానం రాకుండా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నట్టు గ్రానైట్ మాఫియా ప్రచారం చేసుకుంటోంది. ఎనిమిదేళ్లుగా గ్రానైట్ను బహిరంగంగా తరలిస్తున్నా ఇంతవరకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మామూళ్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని అధికారులే గండికొడుతున్నారు.
విచారించి చర్యలు చేపడతాం: చక్రపాణి, డీఎ్ఫఓ
చిలకలగడ్డపల్లి, రెడ్డిపల్లి గ్రామాల మద్య ఫారెస్టుకు ఆనుకుని బఫర్జోనలో అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. విచారించి తగిన చర్యలు తీసుకుంటాం.