CM Chandrababu Naidu: బాబూ జగ్జీవన్రామ్ అసాధారణ శక్తి
ABN , Publish Date - Apr 06 , 2025 | 03:33 AM
సీఎం చంద్రబాబు బాబూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా ఆయన విశిష్టతను కొనియాడారు. ఆయన సాధారణ కుటుంబం నుండి వచ్చి దేశంలో అసాధారణ శక్తిగా ఎదిగారని, దళితుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు

బాబూ జగ్జీవన్రామ్ ఒక సాధారణ కుటుంబంలో పుట్టి దేశంలోనే అసాధారణశక్తిగా ఎదిగారని సీఎం చంద్రబాబు కొనియాడారు. విద్యార్థి దశలోనే ఆయన అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ముప్పాళ్ల గ్రామంలో బాబు జగ్జీవన్రామ్ జయంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. జగ్జీవన్రామ్ రక్షణ మంత్రి, ఉపప్రధానిగా పదవులకు న్యాయం చేశారని కొనియాడారు. 30 ఏళ్లు కేంద్రంలో మంత్రిగా ఉన్నారన్నారు. దేశంలో తొలిసారిగా ఆయన విగ్రహాన్ని ఎన్టీఆర్ హయాంలో హైదరాబాద్లో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు అంబేడ్కర్కు భారతరత్న అవార్డు వచ్చిందన్నారు. దళితుల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి ఈ సంఘటనలు నిదర్శనమన్నారు.