Kadiri : ఖతార్లో చిక్కుకున్న కదిరి మహిళ
ABN , Publish Date - Jan 05 , 2025 | 04:52 AM
పొట్టకూటి కోసం ఖతార్ వెళ్లిన ఓ మహిళ ఇళ్లలో పనులకు కుదిరింది. అయితే ఆ యజమానులు ఆమెను తీవ్రంగా హింసిస్తున్నారు.

రక్షించాలని మంత్రి లోకేశ్కు వినతి
కదిరి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): పొట్టకూటి కోసం ఖతార్ వెళ్లిన ఓ మహిళ ఇళ్లలో పనులకు కుదిరింది. అయితే ఆ యజమానులు ఆమెను తీవ్రంగా హింసిస్తున్నారు. తట్టుకోలేని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన బాధలను చెపుతూ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. శనివారం వైరల్ అయిన ఆ వీడియోలో తనను రక్షించాలంటూ ఆమె మంత్రి లోకేశ్కు విజ్ఞప్తి చేశారు. రషీదా... శ్రీసత్యసాయి జిల్లా కదిరి వాసి. కడప జిల్లా రాజంపేటకు చెందిన ఏజెంటు ద్వారా ఆమె ఖతార్ వెళ్లారు. అక్కడ ఇళ్లలో పనులు చేసేందుకు కుదిరారు. అక్కడి యజమానులు ఆమెను తీవ్రంగా వేధిస్తున్నారు. స్వదేశానికి వచ్చేందుకు విమానం టికెట్ కొనుగోలు చేసినా, వారు రద్దు చేయించారు. దీంతో వారికి తెలియకుండా బాత్ రూంలో సెల్ఫీ వీడియో తీసుకుంటున్నానని, కదిరిలో తన పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆమె కంటతడి పెట్టారు. విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్, ఎక్స్ ద్వారా స్పందించారు. రషీదాను ఖతార్ నుంచి స్వదేశానికి రప్పిస్తామని హామీ ఇచ్చారు.