మామిడి సాగును లాభదాయకంగా మారుస్తాం
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:53 AM
భారతీయ సమాజంతో మామిడికి అవినాభావ సంబంధం ఉందని, మామిడి తోరణాలు, మాగాయి లేని ఇల్లు తెలుగు రాష్ట్రంలో కనబడదని అలాంటి రాష్ట్రంలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఈ పరిస్థితుల్లో మామిడి సాగును లాభదాయకంగా మార్చడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

రైతు దరి చేరని ప్రయోగ ఫలాలు
మామిడి అభివృద్ధికి రూ.100 కోట్లతో నూజివీడుకు ప్రత్యేక క్లస్టర్
మంత్రి పార్థసారథి
నూజివీడు టౌన్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : భారతీయ సమాజంతో మామిడికి అవినాభావ సంబంధం ఉందని, మామిడి తోరణాలు, మాగాయి లేని ఇల్లు తెలుగు రాష్ట్రంలో కనబడదని అలాంటి రాష్ట్రంలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఈ పరిస్థితుల్లో మామిడి సాగును లాభదాయకంగా మార్చడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అనుబంధ నూజివీడు మామిడి పరిశోధన స్థానం ఆధ్వర్యంలో సోమవారం నూజివీడులోని నాగేంద్ర కల్యాణ మండపంలో మామిడి ఎగుమతులు పెంపొందించడానికి పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతు సదస్సు, వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొని మాట్లాడుతూ.. ‘శాస్త్రవేత్తల ప్రయోగ ఫలితాలు మామిడి రైతులకు అందడం లేదు. నూజివీడు ప్రాంతంలో పండే చిన్నరసం రకం మామిడికి జియోలాజికల్ గుర్తింపు సాధించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి. మామిడి అభివృద్ధికి రూ.100 కోట్లతో నూజివీడుకు ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేస్తాం. వచ్చే ఏడాది మామిడి సీజన్ నాటికి నూజివీడు మామిడి మార్కెట్ను రైతులకు అం దుబాటులోకి తీసుకొస్తాం. నూజివీడు మార్కెట్ యార్డులో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తాను’ అన్నారు. వైఎస్ఆర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కే గోపాల్ మాట్లాడుతూ పంటల రక్షణకు చిన్నచిన్న శాస్త్రీయ పద్ధతి పాటిస్తే దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయన్నారు. నూజివీడు మామిడి పరిశోధన స్ధాన ంలో పరిశోధనలకు ఉన్న భూమి చాలడం లేదని మరో 20 ఎకరాలు అవసరం ఉందని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఉద్యానవన శాఖ జాయింట్ డైరెక్టర్ మునిరెడ్డి మాట్లాడుతూ మామిడి రైతులు పురుగుమందులపై ఆధారపడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆపేడా రీజనల్ హెడ్ ఆర్పీ నాయుడు, హార్టీకల్చర్ అధికారి గోవిందరాజులు, నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త కనకమహాలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు. రైతు సదస్సు సందర్భంగా పలు స్టాళ్లను ఏర్పాటు చేసి పరికరాలు, పురుగు మందులు వాడకం, తదితరాలపై అవగాహన కల్పించారు.