Share News

KTR: హైడ్రా, మూసీ పేరుతో మూటలు కడుతున్న కాంగ్రెస్‌ గద్దలు

ABN , Publish Date - Mar 29 , 2025 | 05:42 AM

అసమర్థ పాలనలో సౌభాగ్యనగరం.. అభాగ్యనగరంగా మారిందని, మూసీ, హైడ్రా పేరుతో కాంగ్రెస్‌ గద్దలు మూటలు కడుతున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

KTR: హైడ్రా, మూసీ పేరుతో మూటలు కడుతున్న కాంగ్రెస్‌ గద్దలు

  • బీఆర్‌ఎస్‌ కృషితోనే తెలంగాణకు బీవైడీ: కేటీఆర్‌

హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): అసమర్థ పాలనలో సౌభాగ్యనగరం.. అభాగ్యనగరంగా మారిందని, మూసీ, హైడ్రా పేరుతో కాంగ్రెస్‌ గద్దలు మూటలు కడుతున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు, పెద్దల ఆస్తులతో సెటిల్మెంట్లు చేసుకుంటున్న కారణంగా రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌ అయిందని శుక్రవారం ఎక్స్‌ వేదికగా ఆయన పేర్కొన్నారు. ఇళ్ల కొనుగోళ్లు జరగక రియల్టర్లు ఆందోళనలో పడ్డారని, అన్నదాతలే కాదు రియల్‌ వ్యాపారులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. హైదరాబాద్‌లో గత త్రైమాసికంలో 49ు ఇళ్ల విక్రయాలు తగ్గాయని, ఆఫీస్‌ లీజింగ్‌ కూడా 2025 జనవరి-మార్చి మధ్య 41ు తగ్గిందన్నారు. కాంగ్రెస్‌ సర్కార్‌ దూరదృష్టిలేని, అసమర్థ విధానాలే ఈ పతనానికి కారణమన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన కృషి కారణంగానే.. ఎలక్ట్రిక్‌ వాహన దిగ్గజం బీవైడీ సంస్థ.. ఇప్పుడు తెలంగాణకు వచ్చిందని పేర్కొన్నారు. కాగా, నిష్కల్మషమైన హృదయం కలిగిన పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ అకాల మరణంపై క్రైస్తవ సోదరులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వానికి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఎక్స్‌ వేదికగా ప్రవీణ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, ఈఏడాది మే 30న లండన్‌లో జరిగే ఐడియాస్‌ ఫర్‌ ఇండియా సదస్సుకు రావాలని బ్రిడ్జ్‌ ఇండియా సంస్థ వ్యవస్థాపకుడు ప్రతీక్‌దత్తానీ.. కేటీఆర్‌కు ఆహ్వాన లేఖ పంపారు.


అప్పులపై కాంగ్రె్‌సది తప్పుడు ప్రచారం: కవిత

అప్పులపై కాంగ్రెస్‌ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారానికి తిప్పలు పడుతున్నా అవి పటాపంచలయ్యాయని, పార్లమెంటు సాక్షిగా వాస్తవం బయటపడిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శాసనమండలి మీడియా పాయింట్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అప్పులు మొత్తం రూ.4.42లక్షల కోట్లని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. అయితే తాము రూ.8లక్షల కోట్లు అప్పులు చేశామని సీఎం రేవంత్‌ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Updated Date - Mar 29 , 2025 | 05:42 AM