Minister Lokesh : ఆరోపణలు చేసి పారిపోతున్నారు
ABN , Publish Date - Mar 18 , 2025 | 05:44 AM
‘వైసీపీ హయాంలో టీడీపీ నా యకులపై అక్రమ కేసు లు పెట్టి జైలుకు పంపేందుకు ప్రయత్నించారు.

సమాధానానికి సమయం ఇవ్వడం లేదు
మార్షల్స్తో వారిని సభలోకి తీసుకొని రావాలి
శాసన మండలిలో వైసీపీ సభ్యుల వాకౌట్పై మంత్రి లోకేశ్
అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ హయాంలో టీడీపీ నా యకులపై అక్రమ కేసు లు పెట్టి జైలుకు పంపేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఆ అంశంపై చర్చలో పాల్గొనకుండా ఆరోపణలు చేసి పారిపోతున్నారు’ అని మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం శాసనమండలిలో 2019-24 మధ్య జరిగిన అవినీతి, అక్రమాలపై చర్చను నిరసిస్తూ వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. దీనిపై మంత్రి స్పందించా రు. ‘బీఏసీ అజెండాను నిర్ణయిస్తుంది. అందరూ చర్చించి నిర్ణయం తీసుకున్నా రు. వైసీపీ సభ్యులూ అంగీకరించారు. 2019-24 మధ్య జరిగిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపై చర్చకు అనుమతిస్తూ మండలి చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు. చర్చలో వైసీపీ సభ్యులు 2014-19 మధ్య జరిగిన పాలనపై ఆరోపణలు చేసి ఇప్పుడు సమాధానం ఇస్తుండగా వాకౌట్ చేస్తున్నారు. వైసీపీ సభ్యులు ఆరోపణలు చేసి పారిపోతారు. సమాధానానికి సమయం ఇవ్వరు. ఇది మొదటిసారి కాదు. పదే పదే చేస్తున్నారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతంలో మార్షల్స్ను పెట్టి సభను నడిపించిన పరిస్థితి. ఇప్పుడూ మార్షల్స్ను పెట్టి సభ బయట ఉన్న సభ్యులను సభకు తీసుకురావాలి’ అని మంత్రి లోకేశ్, చైర్మన్ మోషేన్ రాజును కోరారు. ఈ సందర్భంగా 2019-24 మధ్య టీడీపీ నేతలు పలువురిపై పెట్టిన అక్రమ కేసులను ఆయన ప్రస్తావించారు.
విచారణ చేయకుండా ఆరోపణలు చేస్తున్నారు: బొత్స
ఇదే అంశంపై వైసీపీ నేత బొత్స సత్యన్నారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. ‘మండలిలో ఉద్యోగుల సమస్యలపై చర్చిద్దామని అడిగాం. దానిని పక్కన పెట్టి 2019-24 మధ్య స్కాములు జరిగాయంటూ ఆరోపణలు చేశారు. 2014-24 మధ్య జరిగిన వాటిపై చర్చకు అంగీకరిస్తే మేం సిద్ధమని చెప్పాం. విచారణ చేయకుండా ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కోర్టులో ఉన్న కేసుల్ని ఈ ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంటోంది’ అని బొత్స ఆరోపించారు.