21 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:21 AM
జిల్లాలో గంజాయిని రూపు మాపేందుకు పోలీసుశాఖ పనిచేస్తుందని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు.

శ్రీకాకుళం క్రైం, మార్చి 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయిని రూపు మాపేందుకు పోలీసుశాఖ పనిచేస్తుం దని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకా నంద తెలిపారు. గంజాయితో ఎవరైనా పట్టుబడితే రౌడీషీట్ తెరుస్తామని డీఎస్పీ హెచ్చరించారు. ఈ మేరకు శనివారం తన కార్యాలయంలో విలేకరు లతో మాట్లాడారు. స్థానిక రెల్లవీధి సమీపంలో ఉన్న రోటరీ క్లబ్ శ్మశాన వాటికలో శనివారం కొందరు గంజాయి సరఫరా చేస్తున్నట్టు రెండో పట్టణ ఎస్ఐ ఆర్.సంతోష్కి సమాచారం వచ్చింది. దీంతో తన సిబ్బందితో దాడులు నిర్వహించగా.. అప్పటికే ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయించేం దుకు సిద్ధమవుతుండగా ఎస్ఐ సంతోష్ సిబ్బందితో వెళ్లి వారిని పట్టుకుని స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన కైలాష్ బెహరా, సంతోష్కుమార్ మహంతి ఆ రష్ట్రంలోనే గంజాయి కొని ఆంధ్రలో ఎక్కువ ధరకు విక్రయి స్తుంటారన్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళంలోని పాత్రునివలసకు చెందిన గుడియా కాళికి కైలాష్, సంతోష్ 21 కిలోల గంజాయిని విక్రయించారు. ఈ నెల 29న శనివారం కాళి కొనుగోలు చేసిన గంజాయిని విక్రయించేందుకు తనతో పాటు గంజాయి కొనుగోలు చేసి, అమ్మకాలు చేసేవారిని నగరంలోని రోటరీక్లబ్ శ్మశాన వాటిక వద్దకు రమ్మన్నాడు. దీంతో శ్రీకాకుళం నగరంలోని వైష్ణపువీధికి చెందిన బొత్తల చిన్నారావు, జలగడుగుల రాకేష్, మండలవీధికి చెందిన సైలాడ వేణుగోపాల్, కృష్ణాపార్క్ సమీపంలో ఉంటున్న కొత్తపల్లి భీమరాజు, పాత్రునివలసకు చెందిన యడ్ల దిలీప్కుమార్, గంగాడ లోకేష్ అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో ఎస్ఐ తన సిబ్బందితో దాడి చేసి వారిని పట్టుకున్నారు. వీరి నుంచి 21 కిలోల గంజాయి, ఐదు సెల్ఫోన్లు, రూ.400 స్వాధీనం చేసుకు న్నారు. వీరందరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు. అయితే ఈ కేసులో ఒడిశాకు చెందిన మరో వ్యక్తిని పట్టుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. గంజాయితో పట్టుబడిన తొమ్మిది మంది వివిధ కేసులో పాత నేరస్థులేనని డీఎస్పీ స్పష్టం చేశారు. సమావేశంలో టూటౌన్ సీఐ పి.ఈశ్వరరావు, ఎస్ఐ సంతోష్, హెచ్సీలు సింహాచలం, సత్యనారాయణ, కాంతారావు, సిబ్బంది పాల్గొన్నారు.