కాలం చెల్లినవి.. నిషేధిత మందులు
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:37 AM
విజయనగరంలోని అంబటి సత్తర్వు వద్ద వెంకటరత్నం మెడికల్ స్టోర్సులో శుక్రవారం రాత్రి భారీగా కాలం చెల్లిన మందులు, నిషేధిత మత్తుటానిక్లను విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్సుమెంట్, డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

విజయనగరం క్రైం/రింగురోడ్డు, మార్చి 21(ఆంధ్రజ్యోతి): విజయనగరంలోని అంబటి సత్తర్వు వద్ద వెంకటరత్నం మెడికల్ స్టోర్సులో శుక్రవారం రాత్రి భారీగా కాలం చెల్లిన మందులు, నిషేధిత మత్తుటానిక్లను విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్సుమెంట్, డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్సుమెంటు ఎస్పీ బర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో ఇక్కడ తనిఖీ లు నిర్వహించారు. ఈ మెడికల్ షాపులో కొంతకాలంగా కాలం చెల్లిన ఔషధాలు, మత్తుకలిగించే టానిక్లు, లైసెన్సు లేని ప్రొటీన్ పౌడర్లు అమ్ముతున్నట్టు గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. వీటిని స్వాధీనం చేసుకుని నిర్వాహకుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించామన్నారు. వైద్యుల సిఫార్సు లేకుండా మత్తు కలిగించే టానిక్లు అమ్మరాదన్నారు. నిబంధలను అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో డ్రగ్ కంట్రోలర్ రజిత, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా..
విజయనగరం రింగురోడ్డు/బొబ్బిలి/రాజాం రూరల్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): అధికారులు విజయనగరం, నెల్లిమర్ల, బొబ్బిలి, రాజాం తదితర ప్రాంతాల్లోని మెడికల్ షాపుల్లో దాడులు నిర్వహించారు. డ్రగ్ కంట్రోలర్ రజిత రికార్డులను, ఔషధాలను తనిఖీ చేశారు. రాజాంలో షాపులపై కేసులు నమోదు చేశారు. బొబ్బిలి తనిఖీల్లో విజిలెన్స్, సైబర్ క్రైమ్ సీఐలు సతీష్, బి.శ్రీనివాసరావు, డ్రగ్ఇన్స్పెక్టరు లావణ్య, ఈగల్ టీమ్ వెంకటేశ్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.