Indian Air Force: నాలుగు రోజుల్లోనే ఎయిర్ ఫోర్స్కు మరో పెద్ద దెబ్బ
ABN , Publish Date - Apr 06 , 2025 | 10:41 AM
28 ఏళ్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ తన సహ-పైలట్ను రక్షించి, కూలిపోతున్న జెట్ను జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుండి దూరంగా నడిపించి.. ఆపై ప్రాణ త్యాగం..

భారత వైమానిక దళం(Indian Air Force)కు మరో పెద్ద దెబ్బ తగిలింది. బుధవారం గుజరాత్లోని జామ్ నగర్లో శిక్షణా సమయంలో జాగ్వార్ యుద్ధ విమానం కూలిపోవడంతో ఒక పైలట్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన మరువకముందే మరో దారుణం జరిగిపోయింది. నిన్న(శనివారం) ఆగ్రాలో జరిగిన పారాచూట్ జంప్ ట్రైనింగ్( ‘డెమో డ్రాప్’) సమయంలో వైమానిక దళ శిక్షకుడు గాయాల పాలై మరణించాడు. మృతుడు "IAF ఆకాశ గంగ స్కైడైవింగ్ బృందానికి చెందిన వ్యక్తి.
ఇప్పటి పారా జంప్ శిక్షకుడి మరణంతో భారత వైమానిక దళానికి నాలుగు రోజుల్లో ఎదురైన రెండవ పెద్ద నష్టం ఇది. IAF ఈ ఘటనపై లోతుగా విచారిస్తోంది. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబానికి పూర్తి సానుభూతిని తెలియజేస్తూ పూర్తి అండగా ఉంటామని అని భారత వైమానిక దళం ట్వీట్ చేసింది. కాగా, మృతి చెందిన వారెంట్ ఆఫీసర్ యొక్క పారాచూట్ తెరుచుకున్నప్పటికీ, కింద పడి గాయాలపాలై ఆసుపత్రిలో మరణించినట్టు తెలుస్తోంది.
ఇలా ఉండగా, గత బుధవారం జామ్ నగర్లో రేవారీకి చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్, తన జాగ్వార్ ద్విచక్ర విమానం కూలిపోవడంతో మరణించాడు. 28 ఏళ్ల ఈ పైలట్ తన సహ-పైలట్ ఎజెక్ట్ అయ్యేలా చూసుకుని, కూలిపోతున్న జెట్ను జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుండి దూరంగా నడిపించి, తద్వారా నష్టాన్ని నివారించి, తోటి పైలెట్ ప్రాణాలు కాపాడి చివరికి మృత్యువాత పడ్డాడు.
కాగా, యాదవ్ రెండు సంవత్సరాల క్రితం ఫ్లైట్ లెఫ్టినెంట్గా పదోన్నతి పొందాడు. అతను మార్చిలో నిశ్చితార్థం చేసుకోగా, నవంబర్లో వివాహం చేసుకోవాల్సి ఉంది. ఇంతలోనే దారుణం జరిగిపోవడం బాధాకరం.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒంటిమిట్లలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
Sri Rama Navami: జగదభి రాముడు శ్రీరాముడు
For More AP News and Telugu News