Errakunta: పల్లాపైకి రాళ్లు, కోడిగుడ్లు
ABN , Publish Date - Jan 27 , 2025 | 05:05 AM
నాలుగు పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా జనగామ జిల్లా ఎర్రకుంట తండాలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు.

జనగామ జిల్లా ఎర్రకుంటలో పథకాల కార్యక్రమంలో ఉద్రిక్తత
వేదికపైకి పల్లా.. ‘గో బ్యాక్’ అంటూ కాంగ్రెస్ శ్రేణుల నినాదాలు
బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట
ఉద్రిక్తతతో మంత్రి పొంగులేటి పర్యటన రద్దు
జనగామ/హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): నాలుగు పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా జనగామ జిల్లా ఎర్రకుంట తండాలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఎర్రకుంట తండాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి హాజరు కావాల్సి ఉండగా, అధికారులు ఏర్పాట్లు చేశారు. మంత్రి పర్యటన నేపథ్యంలో గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. మరోవైపు, ఎమ్మెల్యే హోదాలో బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సభా వేదికకు వచ్చారు. అక్కడే ఉన్న డీసీపీ రాజమహేంద్రనాయక్తో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులను విడుదల చేయాలని కోరారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ శ్రేణులు పల్లా రాజేశ్వర్ను చూసి ‘పల్లా.. గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.
పరస్పరం కుర్చీలను విసిరేసుకున్నారు. పోలీసులు లాఠీచార్జీ చేయడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో, మంత్రి పొంగులేటి ఎర్రకుంటతండా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇదే విషయాన్ని స్టేజీ మీద అధికారులు ప్రకటించారు. అప్పుడే పల్లా మైక్ తీసుకొని మాట్లాడబోతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆయనపైకి రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. పోలీసులు పల్లాను దూరంగా తీసుకువెళ్లి, బలవంతంగా కారు ఎక్కించి జనగామకు తరలించారు. దీంతో, ఉద్రిక్తత సద్దుమణిగింది. అనంతరం లబ్ధిదారులకు హడావుడిగా పత్రాలను అందించి కార్యక్రమాన్ని ముగించారు. కాంగ్రెస్ శ్రేణులు విసిరిన రాయి ఓ జర్నలిస్టు కంటికి తగిలింది. కాగా, ఎర్రగుంట తండాలో లాఠీచార్జిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ‘హామీలు ఎందుకు అమలు చేయడంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిేస్త లాఠీచార్జీ చేయిస్తారా..’ అని మండిపడ్డారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జీ పేరిట రక్తాలు వచ్చేట్లు కొట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు. బాధ్యులైన పోలీసులపై కఠిన తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వేప పుల్లతో తోమిన పళ్లు అవి.. ఆ కుర్రాడి దంత శక్తిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితే.. ``8``ల మధ్యనున్న ``6``ను కనిపెట్టండి..
Funny Viral News: భర్త మొహానికి లాక్.. బోనులో బంధించిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..
Snake bite video: పాపా.. పాముతో ఆటలాడితే అలాగే ఉంటుంది.. ఓ యువతి పరిస్థితి ఏమైందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి