Share News

నేటి నుంచి పది పరీక్షలు

ABN , Publish Date - Mar 21 , 2025 | 03:00 AM

జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి.

నేటి నుంచి పది పరీక్షలు

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు ఏప్రిల్‌ 2న ముగియనున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న 12,516 మంది విద్యార్థులు ‘పది’ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 6,618 మంది బాలురు, 5,898 మంది బాలికలు ఉన్నారు. 23 మంది ప్రైవేట్‌గా పరీక్షలు రాస్తున్నారు. వీరి కోసం జిల్లావ్యాప్తంగా 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి ఒకరు చొప్పున 73మందిని చీఫ్‌ సూపరింటెండెంట్‌గా, 73 మందిని డిపార్టుమెంట్‌ అధికారులను, 73 మందిని అదనపు డిపార్టుమెంట్‌ అధికారులను నియమించి వారి పర్యవేక్షణలో జరిగే పరీక్షలకు 694 మందిని ఇన్విజిలేటర్లను నియమించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను అరగంట ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. గత ఏడాది మాదిరిగానే ఈసారీ పరీక్షా సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతిస్తారు. 9.35 నిమిషాల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులను పరీక్షకు అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాలకు సమయానికి అరగంట ముందే చేరుకొని ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలులో ఉంటుంది.

ఏర్పాట్లు పూర్తి

సీసీ కెమెరాల నిఘాలో పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా రాసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. డ్యుయల్‌ డెస్క్‌లు, తాగునీరు, గాలి వెలుతురు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. మాల్‌ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్‌ అధికారులు, అదనపు డిపార్టుమెంట్‌ అధికారుల పర్యవేక్షణతోపాటు నాలుగు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ అధ్యక్షతన పదో తరగతి పరీక్షల నిర్వహణపై మూడుసార్లు సమావేశాన్ని నిర్వహించి విద్యా, రెవెన్యూ, పోలీసు, వైద్యశాఖ అధికారులకు మార్గదర్శనం చేయడంతో ఆయాశాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశాయి. జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌ నుంచి విద్యార్థి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విద్యార్థి పుట్టిన తేదీ, ఆధార్‌కార్డు నెంబర్‌ నమోదు చేసి హాల్‌ టికెట్‌ వస్తుందని, ఇందుకు సంబంధించి డీఈవో కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశామని డీఈవో సీహెచ్‌వీఎస్‌ జనార్దన్‌రావు తెలిపారు. విద్యార్థులు ఏమైనా సమస్యలుంటే డెస్క్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ యేడు వంద శాతం ఫలితాలను సాధించే విధంగా పక్క ముందస్తు ప్రణాళికతో విద్యాబోధన చేయడంతోపాటు నిపుణులతో సబ్జెక్టులవారీగా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశామని అన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్‌, ఇతర ఎలక్ర్టానిక్‌ పరికరాలు, వస్తువులను పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించబోమని అన్నారు. హాల్‌ టికెట్‌, ప్యాడ్‌, పెన్‌, పెన్సిల్‌, స్కేల్‌, షార్ప్‌నర్‌, ఎరేజర్‌, జామెట్రీ పరికరాలను మాత్రమే తీసుకవెళ్లవచ్చని చెప్పారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిగిలిన పరీక్షలు రాయకుండా డీబార్‌ చేస్తామని డీఈవో తెలిపారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే తీసుకువచ్చి ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు తల్లిదండ్రులు సహకరించాలని, విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలను సాధించాలని డీఈవో జనార్దన్‌రావు సూచించారు.

పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ అమలు

కరీంనగర్‌ క్రైం: పోలీసు కమిషనరేట్‌ పరిధిలో జరిగే పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు సెక్షన్‌ 163 భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌) అమలులో వుంటుందని పోలీసు కమీషనర్‌ గౌస్‌ ఆలం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబందించిన ఉత్తుర్వులు జారీ చేశారు. ఈ ఉత్తుర్వుల ప్రకారం పదో తరగతి పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు ఇద్దరికి మించి వుండరాదన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డీజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించవద్దని తెలిపారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్‌ సెంటర్లు, జిరాక్స్‌ షాపులు మూసివేయాలని సూచించారు. పరీక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ అమలు చేస్తున్నట్లు పోలీసు కమిషనర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పోలీస్‌ పెట్రోలింగ్‌ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలున తీసుకోవడం జరుగుతుందని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

Updated Date - Mar 21 , 2025 | 03:00 AM

News Hub