విజయోస్తు..
ABN , Publish Date - Mar 21 , 2025 | 02:53 AM
జిల్లాలో శుక్రవారం నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.

జగిత్యాల, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవారం నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలోని 224 ప్రభుత్వ, 104 ప్రయివేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల నుంచి 11,855 మంది విద్యార్థులు రెగ్యులర్గా, మరో 285 మంది ప్రైవేటు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం జిల్లాలో 67 రెగ్యులర్, 2 ప్రైవేటు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 69 సీఎస్లు, 69 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రూట్ ఆఫీసర్లను పరీక్షల పర్యవేక్షణ నిమిత్తం కేటాయించారు. ప్రతీ కేంద్రంలో సరిపడా ఇన్విజిలేషన్ సిబ్బందిని నియమించారు. అవసరమైన పక్షంలో వినియోగించుకునేలా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పలువురు ఉపాధ్యాయులను రిజర్వ్లో ఉంచారు. పరీక్షలో ఎటువంటి మాస్ కాపీయింగ్కు తావు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేంద్రాలను తనిఖీ చేసేలా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. 20 మంది విద్యార్థులకు ఒకరి చొప్పున పరిశీలకులను నియమించారు. పలు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను డీఈవో రాము పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలున్నా 9494780085 టోల్ఫ్రీ నంబరులో సంప్రదించాలని సూచించారు.
ఫకేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్ష కేంద్రానికి వంద మీటర్లు పరిధిలో ఉన్న జిరాక్స్ కేంద్రాలను మూసివేసేలా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలు ఇచ్చారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్ పరికరాలను అనుమతించరు. ఇన్విజిలేషన్ సిబ్బంది, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కూడా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకురావడానికి వీల్లేదు.
విద్యార్థులకు సూచనలు..
ఫవిద్యార్థులు ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
ఫహాల్టికెట్ తప్పనిసరిగా వెంట తీసుకురావాలి.
ఫపరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్షా కేంద్రం నుంచి బయటికి వెళ్లడానికి అనుమతి లేదు.
ఫసున్నితమైన పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ఫసెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, బ్లూటూత్ డివైజులు, స్మార్ట్ వాచ్లు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు.
పదో తరగతి పరీక్షల ఏర్పాట్ల వివరాలు ఇలా...
జిల్లాలో రెగ్యులర్ పరీక్ష కేంద్రాలు...67
ప్రైవేటు పరీక్ష కేంద్రాలు..2
రెగ్యులర్ విద్యార్థులు....11,855
ప్రైవేటు విద్యార్థులు...285
పరీక్షల పరిశీలకులు...826
పరీక్ష పత్రాలను భద్రపరిచేందుకు పాయింట్లు...15
ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు...4
పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తాం
-రాము, జిల్లా విద్యాశాఖ అధికారి
జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. ఇప్పటికే ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇన్విజిలేటర్లకు, సీఎస్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చాం. ఉద్యోగులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇస్తున్నాం.