ఎవరి కర్మ ఫలాన్ని వారే నిర్ణయించుకోవాలి
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:59 PM
మేళ్లచెర్వు, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): భగవంతుడు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తాడని, పట్టుదల, నిబద్ధత, ఏకాగ్రత, భక్తిశ్రద్ధల ద్వారా ఎవరి కర్మఫలాన్ని వారే నిర్ణయించుకోవాలని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్స్వామి అన్నారు.

మేళ్లచెర్వు, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): భగవంతుడు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తాడని, పట్టుదల, నిబద్ధత, ఏకాగ్రత, భక్తిశ్రద్ధల ద్వారా ఎవరి కర్మఫలాన్ని వారే నిర్ణయించుకోవాలని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్స్వామి అన్నారు. మండల కేంద్రంలోని మైహోం సిమెంట్స్ పరి శ్రమలో శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి 27వ బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమంలో అహోబిల రామానుజన జీయర్ స్వామితో కలిసి వేంకటేశ్వరస్వామికి ఏకోత్తర సహస్ర కలశాల అభిషేక మహోత్సవాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1001 కలశాలతో సుగంధ పరిమళ ద్రవ్యాలు, కర్పూరం, పంచామృతాలతో స్వామికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నజీయర్స్వామి మాట్లాడుతూ సమస్త మానవాళి భగవంతుని అనుగ్రహానికి అర్హులేనని అన్నారు. దేశంలో అనేక దేవాలయాలను సంప్రదాయబద్ధంగా, ఆగమన పద్ధతిలో నిర్మించినందున అబాల గోపాలం నుంచి సామాజిక, సాంఘిక, మానసిక వికాస అభివృద్ధికి తోడ్పడుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం చిన్నజీయర్స్వామికి మైహోం గ్రూప్ చైర్మన రామేశ్వరరావు దంపతులు పాదపూజ చేశారు. కార్యక్రమంలో శ్రీకుమారి, మునగాల రామ్మోహనరావు, అరుణ, వైస్ చైర్మన వినోదరావు, భార్గవి, యూనిట్ హెడ్ ఎం. శ్రీనివాసరావు, వేద పండితులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.