Ponguleti: బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు తక్షణమే చెల్లింపులు బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు తక్షణమే చెల్లింపులు
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:50 AM
ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.

స్థలం లేని అర్హులకు ‘డబుల్ ఇండ్లు’
జూన్ చివరి నాటికి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తవ్వాలి: పొంగులేటి
హైదరాబాద్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు తక్షణమే చెల్లింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలు, పలు అంశాలపై జిల్లా మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశమని, కలెక్టర్లందరూ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని సూచించారు.
బేస్మెంట్ పూర్తయిన ఇండ్ల వివరాలను సంబంధిత అధికారులకు పంపితే తక్షణమే చెల్లింపులు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఇండ్ల స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలన్నారు. నిర్మాణం పూర్తికాని ఇళ్లను పూర్తిచేయడానికి కాంట్రాక్టర్ ముందుకురాకపోతే లబ్ధిదారులకే అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.