Music Composer: సంగీత విద్వాంసుడు ఉషాకాంత్ ఇకలేరు
ABN , Publish Date - Mar 26 , 2025 | 06:52 AM
తెలుగు సంగీత విద్వాంసుడు గుండుమిళ్లి వేదాంతం (ఉషాకాంత్) అనారోగ్యంతో కన్నుమూశారు. సంగీతం, గేయ రచన, స్వరకల్పనలో విశిష్ట అందించిన ఆయన తెలుగు సాంస్కృతిక రంగంలో గొప్ప పేరు సంపాదించారు

గేయ రచయిత, సంగీత స్వరకర్త, దర్శకుడు, గాయకుడిగా విశేష కృషి
హైదరాబాద్ సిటీ, మార్చి25 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సంగీత విద్వాంసుడు, తెలుగు సాంస్కృతిక రంగానికి ఉషాకాంత్గా సుపరిచితులైన గుండుమిళ్లి వేదాంతం (90) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఉషాకాంత్ స్వస్థలం గుంటూరు. తల్లి చింతామణి ప్రోత్సాహంతో చిన్నతనంలోనే సంగీత సాధన ప్రారంభించిన ఉషాకాంత్.. గేయ రచన, స్వరకల్పన, దర్శకత్వం, గాత్రం, తదితర పాత్రలతో బహుముఖ ప్రజ్ఞాశీలిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ‘ఆండాళ్నృత్యం’, ‘శ్రీమహాగణపతి’, ‘గీతగోవిందం’, ‘కల్యాణరామం’, ‘శ్రీదత్తగాథ’ తదితర సంగీత రూపకాలకు దర్శకత్వం వహించారు. టీటీడీ ప్రాజెక్టులో భాగంగా పోతన ‘భాగవతం’లోని 108 పద్యాలకు ఉషాకాంత్ స్వరకల్పన చేశారు. అది ఎస్వీబీసీ ఛానల్లో ‘పలికెడిది భాగవతమట’ పేరుతో నేటికీ ప్రసారం అవుతోంది. చిన్నారుల కోసం ‘చిలకపలుకులు’ పద్యాలతో మ్యూజిక్ ఆల్బమ్ రూపొందించారు.