న్యాయం జరగకపోతే లైసెన్స్ రద్దయ్యే వరకు ఫైట్ : శివ బాలాజీ
ABN , First Publish Date - 2020-09-21T20:24:50+05:30 IST
ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని టాలీవుడ్ సినీ నటుడు శివ బాలాజీ ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్ : ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని టాలీవుడ్ సినీ నటుడు శివ బాలాజీ ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే. నగరంలోని మణికొండలో ఉన్న మౌంట్ లిటేరా జీ (Mount litera Z ee) స్కూల్లో చదువుతున్న తన పిల్లలను ఎలాంటి కారణం లేకుండా ఆన్లైన్ క్లాసుల నుంచి తప్పించారని ఆరోపిస్తూ హెచ్ఆర్సీనీ ఆశ్రయించారు. ఆన్లైన్ క్లాస్ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేయగా.. ఆ దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో అడిగి తెలుసుకునేందుకు సోమవారం నాడు శివ బాలాజీ దంపతులు డీఈవోని కలిశారు.
ఫైట్ చేస్తూనే ఉంటాం..!
‘డీఈవోను కలవడం జరిగింది. జరిగిన విషయాలను డీఈవోకు చెప్పాను.హెచ్ఆర్సీ వాళ్ళు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. స్కూల్ నుంచి రియాక్షన్ వచ్చింది. మా పిల్లలకు ఆన్లైన్ క్లాసులకు యాక్సెస్ ఇచ్చారు. ఎందుకు మా పిల్లల్ని స్కూల్ నుంచి తొలగించారో చెప్పాలి..?. స్కూల్ వాళ్ళు టెక్నికల్ ఎర్రర్ అని చెబుతున్నారు. కానీ ఇంటెన్షల్గా చేశారని మేము ఆధారాలన్నీ డీఈవోకి ఇచ్చాము. పేరెంట్స్కి న్యాయం జరగకపోతే స్కూల్ లైసెన్స్ రద్దయ్యేవరకు ఫైట్ చేస్తాం’ అని శివ బాలాజీ మీడియా ముఖంగా చెప్పారు.
కాగా.. శివ బాలాజీ చేసిన ఫిర్యాదుపై ఇదివరకే మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సీ) స్పందించిన విషయం విదితమే. ఈ క్రమంలో దర్యాప్తు చేయమని సంబంధిత అధికారులకు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. సమగ్ర విచారణ చేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డీఈఓకి నోటీసులు జారీ చేయడం జరిగింది.