Bharat Rashtra Samithi: ఇదీ కేసీఆర్ స్ట్రాటజీ!

ABN , First Publish Date - 2022-12-09T18:09:41+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎలాంటి వ్యూహాలను అనుసరించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Bharat Rashtra Samithi: ఇదీ కేసీఆర్ స్ట్రాటజీ!
Bharat Rashtra Samithi

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rashtra Samithi) భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం పొందింది. అయితే బీఆర్ఎస్‌ను జాతీయ స్థాయి పార్టీగా మార్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (K Chandrasekhar Rao) ఎలాంటి వ్యూహాలను అనుసరించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఉదాహరణకు భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు ఆయన జేడీఎస్ చీఫ్ కుమార‌స్వామిని ఆహ్వానించారు. అంతేకాదు కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి పోరాడతామని కేసీఆర్ ప్రకటించారు. వచ్చే ఏడాదే కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్, బీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది నెమ్మదిగా నిర్ణయించుకున్నా జాతీయ పార్టీగా మారేందుకు గల అవకాశాలన్నింటినీ కేసీఆర్ పరిశీలిస్తున్నారు. దక్షిణ భారత దేశంలో అనేక రాష్ట్రాల్లో ఆయా అధికార పార్టీల అధినేతలతో కేసీఆర్‌‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. కర్ణాటక తరహాలోనే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా బీఆర్ఎస్ తరపున అభ్యర్ధులను ప్రకటించవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

అలాగే 2024లో లోక్‌సభ ఎన్నికల్లో తెలుగువారు ఎక్కువగా ఉండే వివిధ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ తరపున అభ్యర్ధులను ప్రకటించవచ్చు. వివిధ రాష్ట్రాల సీఎంలతో, పార్టీల అధినేతలతో ఉన్న సంబంధాలను బట్టి తెలుగువారి ఓట్లను రాబట్టుకునేందుకు బీఆర్ఎస్ తరపున అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని పరిశీలకులు చెబుతున్నారు. ఉదాహరణకు మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబైలో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉంటారు. అలాగే గుజరాత్ సూరత్‌లో తెలుగువారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. గుజరాత్ నేతలతో కేసీఆర్ ఇప్పటికే టచ్‌లోకి వచ్చేశారు. ఒడిశాలోనూ అనేక చోట్ల తెలుగువారి ప్రభావం ఎక్కువే. రాజధాని ఢిల్లో లోనూ తెలుగువారి ప్రభావం చెప్పుకోదగిన స్థాయిలోనే ఉంది. తెలుగువారి ఉనికి ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఉనికి ఎక్కడ ఉన్నా ఆయా రాష్ట్రాల్లోని పార్టీలతో బీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉంది.

ఓట్లు, సీట్లు సాధించడం ద్వారా భారత్ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా అవతరించేలా చేసుకోవడం కేసీఆర్ ప్రథమ వ్యూహంగా ఉంటుంది. ఆ తర్వాత బీజేపీ (BJP) వ్యతిరేక పార్టీలతో పొత్తు పెట్టుకుని కమలనాథుల ఓట్లను చీల్చడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేయవచ్చు. భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభలోనే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదం వినిపించడంతో దేశవ్యాప్తంగా రైతులకు సంబంధించిన అంశాల్లో కేసీఆర్ దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. కేసీఆర్ గతంలోనే రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన వారి కుటుంబాలకు ఆర్ధిక సాయం ప్రకటించారు. పంజాబ్ వెళ్లి మరీ చెక్కులు కూడా పంపిణీ చేశారు.

బీజేపీని దెబ్బతీసేందుకు గల ఏ చిన్న అవకాశాన్నీ వదలకుండా కేసీఆర్ వ్యవహరించే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ ద్వారా కమలనాథుల విజయావకాశాలను వీలైనంత దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్ రాష్ట్ర సమితి పనిచేయవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే భారత్ రాష్ట్ర సమితి ఎన్డీయేతర కూటమి అయిన యూపిఏలో చేరుతుందా లేదా అనేది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే స్పష్టత వచ్చే అవకాశముంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండాలా వద్దా వచ్చే ఏడాది జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి ఉంటుంది. మొత్తం మీద తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జయాపజయాలను బట్టి కేసీఆర్ స్ట్రాటజీ ఉండే అవకాశం ఉంది.

Updated Date - 2022-12-09T18:53:34+05:30 IST