‘గడప గడప’లో ఎంపీని నిలదీసిన జనం
ABN , First Publish Date - 2023-08-18T03:55:58+05:30 IST
గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ నాయకులకు నిలదీతలు ఎదురయ్యాయి. అనంతపురం జిల్లా మర్తాడు గ్రామంలో గురువారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

గార్లదిన్నె, ఆగస్టు 17: గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ నాయకులకు నిలదీతలు ఎదురయ్యాయి. అనంతపురం జిల్లా మర్తాడు గ్రామంలో గురువారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీ తలారి రంగయ్య, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి పాల్గొన్నారు. పింఛన్, రోడ్లు, విద్యుత్ సమస్యలపై ప్రజలు వారిని నిలదీశారు. దేవమ్మ అనే వృద్ధురాలి ఇంటి వద్దకు వెళ్లిన సాంబశివారెడ్డి ‘మీకు ప్రభుత్వం నుంచి 3 లక్షల వరకు డబ్బు వచ్చింది’ అని ఆమెతో అన్నారు. దీంతో ఆమె తమకు ఏమీ రాలేదంటూ సమస్యలపై ప్రశ్నిస్తుండగా వైసీపీ నాయకులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీన్ని చిత్రీకరించేందుకు ప్రయత్నించిన విలేకరులను వైసీపీ నాయకులు, సాంబశివారెడ్డి అడ్డుకున్నారు. చిన్న సంఘటనలను పెద్దవిగా చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.