Tripura : బీజేపీ ఎమ్మెల్యేలను కొంటా : తిప్ర మోత పార్టీ చీఫ్

ABN , First Publish Date - 2023-02-16T12:37:53+05:30 IST

త్రిపుర శాసన సభ ఎన్నికల పోలింగ్ ఓ వైపు జరుగుతుండగానే, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తిప్ర మోత (Tipra Motha) చీఫ్ ప్రద్యోత్ మాణిక్య దెబ్బర్మ

Tripura : బీజేపీ ఎమ్మెల్యేలను కొంటా : తిప్ర మోత పార్టీ చీఫ్
Tipra Motha Chief Pradyot Debbarma

అగర్తల : త్రిపుర శాసన సభ ఎన్నికల పోలింగ్ ఓ వైపు జరుగుతుండగానే, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తిప్ర మోత (Tipra Motha) చీఫ్ ప్రద్యోత్ మాణిక్య దెబ్బర్మ (Pradyot Manikya Debbarma) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి పోటీనిస్తున్న ఏకైక పార్టీ తమదేనని చెప్పారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత లభించకపోతే, బీజేపీ ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నామని తెలిపారు. ఆయన గురువారం విలేకర్లతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది.

ఎన్నికల అనంతరం పొత్తులు, బేరసారాల గురించి విలేకర్లు ప్రశ్నించినపుడు ప్రద్యోత్ మాట్లాడుతూ, తమ పార్టీకి ఈ ఎన్నికల్లో 30 కన్నా తక్కువ స్థానాలు లభిస్తే, తన రాజప్రాసాదంలో కొంత భాగాన్ని అమ్మేసి, బీజేపీ ఎమ్మెల్యేల్లో 25 నుంచి 30 మందిని కొనాలని అనుకుంటున్నానని చెప్పారు. డబ్బు డబ్బేనన్నారు. ‘‘మేము మాత్రమే అమ్మకానికి ఉన్నామని ఎందుకు భావించాలి? మా గురించి మాత్రమే ఎందుకు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు? బీజేపీ ఎమ్మెల్యేలను కూడా కొనవచ్చు’’ అన్నారు.

ఇదిలావుండగా, త్రిపుర శాసన సభ ఎన్నికల పోలింగ్ గురువారం జరుగుతోంది. మొత్తం 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ (BJP)ని గద్దె దించాలనే లక్ష్యంతో బద్ధ శత్రువులైన కాంగ్రెస్, సీపీఎం ఈ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేస్తున్నాయి. బీజేపీ, ఇండిజెనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర కూటమి, తిప్ర మోత, కాంగ్రెస్-సీపీఎం మధ్య ప్రధాన పోటీ ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 2న జరుగుతుంది.

బీజేపీ నేత బిప్లబ్ దేబ్ ఓటు వేసిన తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ, తమ పార్టీ వరుసగా రెండోసారి అధికారాన్ని చేపడుతుందన్నారు. త్రిపుర చాలా కాలం చీకట్లో ఉందన్నారు. నేడు యువత ఆశావాదంతో ఉన్నారన్నారు. మహిళల ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరుస్తున్నాయన్నారు. వృద్ధులు నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారని తెలిపారు. గతంలో ఇవేవీ ఉండేవి కాదన్నారు. ప్రజలు తమ భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకుంటున్నారని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, తమ పార్టీకి ఆధిక్యత లభిస్తుందని తెలిపారు. ప్రజలే అత్యున్నతులని, ఏ ఎన్నికలనూ చిన్నవి, పెద్దవి అని తాము చూడబోమని చెప్పారు. ప్రజలను గౌరవించడం తమ కర్తవ్యమని తెలిపారు. 2018లో తమకు అధికారాన్ని ఇచ్చారని, కోవిడ్ మహమ్మారి సమయంలో సైతం తాము రాష్ట్రంలోని అన్ని రంగాల్లోనూ సేవలందించామని చెప్పారు. ఈ విషయం ప్రజలకు తెలుసునన్నారు.

ఇవి కూడా చదవండి :

Tripura Polls : ప్రశాంతంగా ప్రారంభమైన త్రిపుర శాసన సభ ఎన్నికల పోలింగ్

Chandrababu TDP : రాజధానిపై జగన్‌ మాటలు వింటే ఊసరవెల్లికీ సిగ్గేస్తుంది

Updated Date - 2023-02-16T12:37:59+05:30 IST