YCP MLA Anil: వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కు యాంటీగా ఇంత జరుగుతోందా..?

ABN , First Publish Date - 2023-06-26T13:41:26+05:30 IST

అనిల్‌ వ్యతిరేక వర్గీయులుగా ముద్ర పడ్డ రూప్‌కుమార్‌, ముక్కాల ద్వారకానాథ్‌లు పార్టీలో పట్టు పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అనిల్‌ వ్యవహారశైలి ఏ మాత్రం మింగుడుపడని ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు రూప్‌కుమార్‌ తదితరులకు ఆశీస్సులందిస్తున్నారు.

YCP MLA Anil: వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కు యాంటీగా ఇంత జరుగుతోందా..?

పట్టు సాధించే పనిలో బాబాయ్‌ వర్గం

నెల్లూరు జిల్లా నేతల మద్దతు కోసం యత్నాలు

వీపీఆర్‌, ఆదాల, కాకాణిలతో వరుస భేటీలు

వారి ఆశీస్సులు కోరిన రూప్‌, ముక్కాల

అన్యాయం జరగదని మంత్రి, ఎంపీల భరోసా

నెల్లూరు (ఆంధ్రజ్యోతి): నెల్లూరు నగర డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌, నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారకానాథ్‌లపై పార్టీపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధిష్ఠానంపై నగర ఎమ్మెల్యే అనిల్‌ ఒత్తిడి పెంచుతున్నారు. అదే సమయంలో అనిల్‌ వ్యతిరేక వర్గీయులుగా ముద్ర పడ్డ రూప్‌కుమార్‌, ముక్కాల ద్వారకానాథ్‌లు పార్టీలో పట్టు పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అనిల్‌ వ్యవహారశైలి ఏ మాత్రం మింగుడుపడని ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు రూప్‌కుమార్‌ తదితరులకు ఆశీస్సులందిస్తున్నారు. తాజాగా మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి కూడా వీరికి అభయమిచ్చినట్లు సమాచారం.

రూప్‌ను సస్పెండ్‌ చేయాలి..

రూప్‌కుమార్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని, ఆయన ప్రారంభించిన కార్యాలయాన్ని మూసివేయించాలని అనిల్‌ వైసీపీ అగ్రనాయకులపై ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. కావలి తరహాలో నెల్లూరు నగరంలో సైతం తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధిష్ఠానాన్ని గట్టిగా కోరినట్లు సమాచారం. అయితే అది సాధ్యపడడం లేదు. ఈ క్రమంలో రెండు రోజులుగా అనిల్‌ స్వరం పెంచారు. శుక్రవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో వ్యతిరేకవర్గమైన రూప్‌కుమార్‌, ముక్కాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వేమిరెడ్డి సతీమణిని రాజమాతగా పోల్చుతూ పరోక్షంగా విమర్శలు చేశారు. బలప్రదర్శన తరహాలో కార్యకర్తల సమావేశం నిర్వహించి, తన డిమాండ్లు పరిష్కరించాలని పరోక్షంగా అధిష్ఠానంపై ఒత్తిడి పెంచారు.

మద్దతు కోసం ప్రయత్నాలు

అనిల్‌ ప్రయత్నాలు ఇలా ఉండగా రెండు రోజుల నుంచి రూప్‌కుమార్‌, ద్వారకానాథ్‌లు జిల్లా పార్టీ నేతల మద్దతు కూడగట్టుకునే పని మొదలు పెట్టారు. ఈ క్రమంలో శనివారం వేమిరెడ్డి నివాసంలో ఎంపీలు వేమిరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలతో రూప్‌కుమార్‌, ముక్కాల సమావేశమ య్యారు. పార్టీ కోసం పనిచేస్తున్న తమకు అండగా నిలవాలని వారిని కోరినట్లు సమాచారం. అనిల్‌ వ్యవహారశైలితో ఏమాత్రం సంతృప్తిగాలేని ఎంపీలు రూప్‌,ముక్కాలకు తమ ఆశీస్సులు అందజేసినట్లు ప్రచారం. పార్టీ కోసం శ్రమించేవారికి ఎలాంటి అన్యాయం జరగదని ఎంపీలు వీరికి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. అనిల్‌ వ్యతిరేక బృందం ఆదివారం ఉదయం మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిని కలిశారు. జిల్లాలో మాజీమంత్రి అనిల్‌, ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిలు ఉప్పు, నిప్పులా ఉన్న విషయం తెలిసిందే. మంత్రి అయిన తరువాత కాకాణి పూర్వ వివాదాలను పక్కన పెట్టినా అనిల్‌తో ఉన్న పొరపొచ్చాలు పూర్తిగా తొలగిపోలేదు.

అనిల్‌ మంత్రిగా ఉన్న కాలంలో జరిగిన సంఘటన నేపథ్యంలో రూప్‌కుమార్‌ ఇప్పటి వరకు మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కూడా కలవలేని పరిస్థితి. తొలిసారిగా ఆదివారం రూప్‌కుమార్‌ కాకాణిని వద్దకు వెళ్లారు. ద్వారకానాథ్‌, మూలపేట శివాలయం చైర్మన్‌ లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సిటీకి చెందిన కొందరు కార్పొరేటర్లు, సిటీ వైసీపీలోని కొంతమంది ద్వితీయశ్రేణి నాయకులతో కలిసి మంత్రి కాకాణిని కలిశారు. ఆయన నివాసంలో చాలాసేపు చర్చించారు. పార్టీ కోసం పనిచేసే తమకు అండగా ఉండాలని వారు మంత్రిని కోరినట్లు సమాచారం. ఒకవైపు వీరిపై వేటు వేయాలని అనిల్‌ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో జిల్లా పార్టీ నేతల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో రూప్‌కుమార్‌, ముక్కాల వర్గం ప్రయత్నాలు మొదలు పెట్టడం గమనార్హం.

Updated Date - 2023-06-26T13:41:37+05:30 IST