‘మల్లు’ చూపు.. చేవెళ్ల వైపు!
ABN , First Publish Date - 2023-10-11T00:12:31+05:30 IST
చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇపుడు కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సీటుపై స్థానిక నేతలు కొందరు ఆశలు పెట్టుకున్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే యాదయ్యను ఢీకొట్టేందుకు బలమైన అభ్యర్ధి కోసం కాంగ్రెస్ నాయకత్వం అన్వేషిస్తున్నట్లు తెలిసింది.

టికెట్ కోసం ఢిల్లీలో ప్రయత్నం
కాంగ్రెస్లో ఇదే హాట్ టాపిక్
చేవెళ్ల, అక్టోబరు 10: చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇపుడు కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సీటుపై స్థానిక నేతలు కొందరు ఆశలు పెట్టుకున్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే యాదయ్యను ఢీకొట్టేందుకు బలమైన అభ్యర్ధి కోసం కాంగ్రెస్ నాయకత్వం అన్వేషిస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ పరిస్థితులు ఆశాజనకంగా ఉండడంతో పార్టీలోని ఇతర నేతలు కూడా ఈ స్థానంపై కన్నేసినట్లు సమాచారం. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన కొద్ది రోజులుగా చేవెళ్ల టికెట్ కోసం ఆయన ఢిల్లీలో ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలో మల్లు రవి నాగర్కర్నూల్ ఎంపీగా రెండుసార్లు, ఎమ్మెల్యేగా ఒకసారి విజయం సాధించారు. ఇదిలా ఉంటే ఇతర పార్టీ నేతలు కూడా ఇక్కడ కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం కూడా ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఆయన తరపున కూడా కొందరు టికెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు. అయితే ఆయన గతంలో పార్టీ టికెట్ తీసుకుని పోటీచేసి ఓటమి అనంతరం తిరిగి బీఆర్ఎస్లో చేరారు. ఇపుడు ఇది ఆయనకు కొంత మైనస్గా మారింది. ఇక బీజేపీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు కూడా ఇక్కడ కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతలు ఎస్. వసంతం, షాబాద్ దర్మన్, భీమ్ భరత్, సులోచన కూడా చేవెళ్ల నుంచి టికెట్ రేస్లో ఉన్నారు.