Share News

గూగుల్‌ టేకౌట్‌తో గుట్టు రట్టు

ABN , Publish Date - Sep 18 , 2024 | 05:14 AM

పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్‌ గున్నీ, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ చేసిన పథక రచనకు సంబంధించిన కీలకమైన డిజిటల్‌ ఆధారాలు దర్యాప్తు అధికారుల చేతికి చిక్కాయి.

గూగుల్‌ టేకౌట్‌తో గుట్టు రట్టు

జెత్వానీ కేసులో తాడేపల్లి కుట్ర బద్దలు

ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసులో గుట్టును గూగుల్‌ టేకౌట్‌ రట్టు చేసింది. ఐపీఎస్‌ అధికారులు, వైసీపీ నేతలు తాడేపల్లి ప్యాలెస్‌ వేదికగా పన్నిన కుట్ర కోణాన్ని డిజిటల్‌ టెక్నాలజీ సాయంతో దర్యాప్తు అధికారులు పసిగట్టారు.

ముంబై నటిపై వేధింపులకు అక్కడే స్కెచ్‌

వేర్వేరుగా ముంబైకి పోలీసులు, విద్యాసాగర్‌

ఆమెను పోలీసులకు చూపించింది అతడే

ఆ టైమ్‌లో ఐపీఎస్‌లకు, ఆయనకు మధ్య మెసేజ్‌లు

టెక్నాలజీ సాయంతో పసిగట్టిన దర్యాప్తు బృందం

ఆ ముగ్గురు ఐపీఎస్‌లకు బిగుస్తున్న ఉచ్చు

ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగులోకి

విద్యాసాగర్‌పై లుక్‌ అవుట్‌ నోటీస్‌ యోచన

జెత్వానీ కేసులో ఎవరినీ వదలం: హోంమంత్రి అనిత

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

నాటి ముఖ్యమంత్రి జగన్‌ స్నేహితుడిని రక్షించేందుకు అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌

పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్‌ గున్నీ, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ చేసిన పథక రచనకు సంబంధించిన కీలకమైన డిజిటల్‌ ఆధారాలు దర్యాప్తు అధికారుల చేతికి చిక్కాయి. జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఎంతటి వ్యక్తులున్నా వదలవద్దని పోలీసు ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ముంబై నటి జెత్వానీ తన తల్లితో కలిసి విజయవాడకు వచ్చి తనకు నాడు జరిగిన అన్యాయం, వేధించిన వ్యక్తులు, ఇబ్బంది పెట్టిన అధికారులపై పోలీసు కమిషనర్‌ రాజశేఖర్‌ బాబుకు ఫిర్యాదు చేశారు. ఆయన సూచన మేరకు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో ఆమె రాతపూర్వక ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అందులో మొదటి నిందితుడిగా ఉన్న కుక్కల విద్యా సాగర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన ఆచూకీ కోసం టెక్నాలజీ ప్రయోగించడంతో విస్తుపోయే నిజాలు బయట పడ్డాయి. ఆయన సెల్‌ నెంబర్‌ ఆధారంగా ఎక్కడున్నారో కూపీలాగే ప్రయత్నంలో గూగుల్‌ టేకౌట్‌ను ప్రయోగించినట్లు తెలిసింది. అయితే ఫిబ్రవరి 2న విద్యాసాగర్‌ ముంబైలో విశాల్‌ గున్నీ ఇతర పోలీసులతో కలిసి ఉన్నట్లు బయటపడింది.

‘సకల శాఖల మంత్రి’ ఆదేశాలతోనే..

జెత్వానీని ముంబై నుంచి తీసుకురావడానికి ఆనాడు విజయవాడ పోలీసులు గన్నవరంలో విమానం ఎక్కితే.. విద్యాసాగర్‌ హైదరాబాద్‌లో బయలు దేరి ముంబైకి చేరుకున్నారు. అంతకుముందు తాడేపల్లి ప్యాలె్‌సలో వేసుకున్న స్కెచ్‌ ప్రకారం జెత్వానీ కదలికలు, అమె నివాసం ఎక్కడుందో తెలిసిన వ్యక్తిని తీసుకెళ్లాలని నిఘా విభాగం అధిపతి సూచించినట్లు తెలిసింది. ముగ్గురు ఐపీఎస్‌లు తాడేపల్లి ప్యాలె్‌సలో మాట్లాడుకున్నప్పుడు సకల శాఖల మంత్రిగా పేరు గాంచిన నాయకుడు....విద్యాసాగర్‌ను అక్కడికి పిలిపించారు. ‘పోలీసు అధికారులకు సహకరించు’ అని సూచించినట్లు సమాచారం. విజయవాడలో ఒకే విమానం ఎక్కితే తెలిసి పోతుందని, హైదరాబాద్‌ నుంచి విద్యాసాగర్‌ బయలుదేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముంబైలోని జూహూలోని గుల్‌మహర్‌ రోడ్డులో ఉన్న ఐడియల్‌ అపార్ట్‌మెంట్‌లో జెత్వానీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. ఆమె తన కుటుంబంతో కలిసి కారులో బయటకు రావడం విద్యాసాగర్‌ చూశారు. ఆ సమాచారం పోలీసులకు ఇచ్చి.. తాను కారులో వారిని అనుసరించినట్లు సమాచారం. గూగుల్‌ టేకౌట్‌ ద్వారా కేసులో డిజిటల్‌ ఆధారాలు సేకరించే పనిలో బెజవాడ పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలో ఐపీఎస్‌ అధికారులకు, వైసీపీ నేతలకు మధ్య నడిచిన వాట్సాప్‌ సందేశాలు, మెయిల్స్‌ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే పెద్ద ఖాకీలను నిందితులుగా చేర్చాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అన్నీ సేకరించుకుని విద్యాసాగర్‌ కేసులో అదర్స్‌ అనేచోట ఏ2, ఏ3, ఏ4గా పెద్ద పోలీసుల్ని చేర్చబోతున్నట్లు సమాచారం. ఆధారాలు బలంగా ఉంటే ఇదే ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్‌ 120(బి) చేర్చి కుట్ర కోణాన్ని పూర్తిస్థాయిలో ఉచ్చు బిగించనున్నట్లు తెలుస్తోంది. ఫోను స్విచ్చాఫ్‌ చేసి పరారీలో ఉన్న విద్యాసాగర్‌ కోసం లుక్‌ అవుట్‌ నోటీసులు జారీచేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు విశ్వసనీయ సమచారం.

జెత్వానీ కేసులో ఎవరినీ వదలబోం: హోంమంత్రి

జెత్వానీ కేసులో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదని హోంమంత్రి అనిత అన్నారు. దీనివెనుక ఉన్న అందరినీ శిక్షిస్తామని స్పష్టం చేశారు. ‘‘కాదంబరి కేసులో సస్పెండ్‌ అయిన ఐపీఎస్‌ అధికారుల వెనుక ఎంతమంది ఉన్నా వదిలిపెట్టబోం. వారి వెనుక సలహాదారులు ఉన్నా, సూత్రధారులు ఉన్నా వదిలిపెట్టబోం’’ అని అనిత హెచ్చరించారు.

Updated Date - Sep 18 , 2024 | 05:14 AM