AP Deputy CM : అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీ పడొద్దు
ABN , Publish Date - Dec 24 , 2024 | 03:14 AM
సురక్షితమైన తాగునీటిని ప్రజలకు అందించేందుకు, రహదారులను పూర్తి నాణ్యతతో అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.

చేసిన పని పది కాలాలపాటు ఉపయోగపడాలి: పవన్ కల్యాణ్
సంక్రాంతిలోగా ‘పల్లె పండుగ’ రోడ్లు పూర్తికావాలి
సురక్షిత తాగునీరు అందించేందుకు చర్యలు.. కృష్ణాలో పర్యటన
రోడ్లు, వాటర్ ట్యాంక్ను పరిశీలించిన డిప్యూటీ సీఎం
మచిలీపట్నం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): సురక్షితమైన తాగునీటిని ప్రజలకు అందించేందుకు, రహదారులను పూర్తి నాణ్యతతో అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కంకిపాడు-రొయ్యూరు-గొడవర్రు వరకు రూ.3.75 కోట్లతో అభివృద్ధి చేస్తున్న రహదారి పనులు.. గోశాలలో రూ.33 లక్షలతో రోడ్ల మరమ్మతులు, డ్రెయిన్ పనులు.. గుడివాడ మండలం కొత్తచౌటుపల్లిలోని మల్లాయపాలెం హెడ్వాటర్వర్క్స్ను సోమవారం ఆయన పరిశీలించారు. కంకిపాడు-గొడవర్రు రహదారిని ఎన్ని లేయర్లలో, ఎంత మందంతో నిర్మిస్తున్నారో.. రోడ్డును తవ్వించి మరీ చూశారు. పనుల్లో నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంక్రాంతిలోగా రహదారి పనులు పూర్తి చేయాలన్నారు. గత 15 ఏళ్లుగా ఈ రహదారిని అభివృద్ధి చేయలేదని.. ఇంతకాలానికి పనులు చేస్తున్నారంటూ గ్రామస్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. చేసిన పని పది కాలాలపాటు ప్రజలకు ఉపయోగపడాలనేది తమ అభిమతమని పవన్ అన్నారు. అనంతరం మల్లాయపాలెంలోని హెడ్వాటర్వ ర్క్స్ వద్ద ఫిల్టర్బెడ్ల పనితీరు, నీటిని శుద్ధిచేసే విధానాలను పరిశీలించారు రక్షిత మంచినీటి నమూనాలను పరిశీలించారు. ఆయన వెంట మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, వెనిగండ్ల రాము, వర్ల కుమార్రాజా, బోడే ప్రసాద్, ఏపీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, అధికారులు ఉన్నారు.