Share News

National : సరిహద్దులో డ్రాగన్‌ కవ్వింపు

ABN , Publish Date - May 31 , 2024 | 05:04 AM

భారత సరిహద్దుల్లో సిక్కింకు 150 కిలో మీటర్ల దూరంలో చైనా 6 అధునాతన యుద్ధ విమానాలను మోహరించింది

National : సరిహద్దులో డ్రాగన్‌ కవ్వింపు

  • సిక్కింకు 150 కి.మీ. దూరంలో 6 స్టెల్త్‌ ఫైటర్లు

  • గతంలోనూ టిబెట్‌లో జే-20ల మోహరింపు

న్యూఢిల్లీ, మే 30: భారత సరిహద్దుల్లో సిక్కింకు 150 కిలో మీటర్ల దూరంలో చైనా 6 అధునాతన యుద్ధ విమానాలను మోహరించింది. చైనా ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన జే-20 స్టెల్త్‌ ఫైటర్లను టిబెట్‌లోని షిగాట్సె ఎయిర్‌పోర్టులో ఉంచింది. ఈ నెల 27న సేకరించిన ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం వెలుగు చూసింది.

కాగా షిగాట్సెకు 290 కిలో మీటర్ల దూరంలో పశ్చిమబెంగాల్‌లోని హసిమరలో భారత వాయుసేన 16 రాఫెల్‌ యుద్ధ విమానాలతో రెండో స్క్వాడ్రన్‌ ఏర్పాటు చేసింది. టిబెట్‌లోని రెండో అతిపెద్ద నగరమైన షిగాట్సెలో 12,408 అడుగుల ఎత్తులో చైనా నిర్మించిన విమానాశ్రయం ప్రపంచంలోనే ఎత్తైన ఎయిర్‌పోర్టుల్లో ఒకటి.

సైనిక, పౌర అవసరాల కోసం నిర్మించిన ఈ విమానాశ్రయంలో చైనా జే-20 ఫైటర్లను మోహరించినట్టు ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించే ఓ సంస్థ పేర్కొంది. అలాగే ఏకేజే-500 ఎయిర్‌బోర్న్‌ ఎర్లీ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ ఎయిర్‌క్రా్‌ఫ్టను కూడా అక్కడ ఉంచినట్టు వెల్లడించింది. సరిహద్దుల్లో చైనా జే-20 ఫైటర్లను మోహరించిన విషయం భారత్‌ ఎయిర్‌ఫోర్స్‌ దృష్టికి వచ్చింది.

అయితే ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. టిబెట్‌ భూభాగంలో చైనా జే-20 ఫైటర్లను మోహరించడం ఇదే తొలిసారి కాదు. 2020-23 మధ్య కాలంలో కూడా ఆ ప్రాంతంలో జే-20 ఫైటర్లు ఉన్నట్టు గుర్తించారు.

Updated Date - May 31 , 2024 | 06:25 AM