Share News

మోదీ.. మీరో శక్తి

ABN , Publish Date - Jul 09 , 2024 | 05:10 AM

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ సోమవారం రష్యా చేరుకున్నారు. మాస్కో విమానాశ్రయంలో ఆయనకు రష్యా తొలి ఉప ప్రధాని డెనిస్‌ మంటురోవ్‌ ఘన స్వాగతం పలికారు. అలాగే ఒకే కారులో మోదీతో కలిసి వెళ్లి, ఆయనకు బస ఏర్పాటు చేసిన హోటల్‌లో దింపారు. అనంతరం మోదీ రష్యా అధ్యక్షుడు

మోదీ.. మీరో శక్తి

మీ జీవితం ప్రజలకు అంకితం!.. చరిత్రాత్మక గెలుపునకు అభినందనలు

ప్రధానితో రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. కలిసి భోజనం.. నేడు చర్చలు

మాస్కో, జూలై 8: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ సోమవారం రష్యా చేరుకున్నారు. మాస్కో విమానాశ్రయంలో ఆయనకు రష్యా తొలి ఉప ప్రధాని డెనిస్‌ మంటురోవ్‌ ఘన స్వాగతం పలికారు. అలాగే ఒకే కారులో మోదీతో కలిసి వెళ్లి, ఆయనకు బస ఏర్పాటు చేసిన హోటల్‌లో దింపారు. అనంతరం మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నివాసానికి చేరుకున్నారు. ఆయన మోదీకి సాదర స్వాగతం పలికారు. వరుసగా మూడోసారి ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన మోదీకి అభినందనలు తెలిపారు. ఆయన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని కొనియాడారు. ‘‘ముందుగా ప్రధానమంత్రిగా మళ్లీ ఎన్నికైనందుకు మీకు అభినందనలు. ఈ విజయం యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. ప్రభుత్వాధినేతగా పదేళ్లుగా మీరు చేసిన పనులకు దక్కిన ఫలితం. మీరు చాలా శక్తిమంతమైన వ్యక్తి. భారత్‌, ప్రజల ప్రయోజనాలకు అవసరమైన ఫలితాలను ఎలా సాధించాలో మీకు బాగా తెలుసు. ఫలితాలు కూడా అలాగే వస్తాయి. భారత్‌ ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది’’ అని పుతిన్‌ మోదీతో చెప్పారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపిన మోదీ.. సంస్కరణలు తేవడమే తన సిద్ధాంతమని చెప్పారు. తన ప్రభుత్వ విధానాలకు భారత ప్రజలు ఆమోదముద్ర వేశారన్నారు. మూడోసారి గెలిచిన తాను మూడు రెట్లు ఎక్కువగా పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్పందించిన పుతిన్‌.. ‘మీ జీవితాన్ని భారత ప్రజలకు అంకితం చేశారు. ఆ విషయం వారికీ తెలుసు’ అని చెప్పారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి భోజనం చేశారు.

మోదీకి ఘన స్వాగతం..

రష్యాలో ప్రొటోకాల్‌ ప్రకారం పుతిన్‌ తర్వాత స్థాయిలో మంటురోవ్‌ ఉంటారు. అలాంటి వ్యక్తి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి మోదీకి స్వాగతం పలకడం ద్వారా చైనాకు గట్టి సంకేతాలు ఇచ్చినట్లయింది. గతంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఉప ప్రధాని స్వాగతం పలకగా.. మోదీ కోసం తొలి ఉప ప్రధాని మంటురోవ్‌ వెళ్లడం విశేషం. ఈ చర్య ద్వారా రష్యా.. భారత్‌కు ఇస్తున్న ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పినట్లయింది. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో మాస్కోలోని 1771 అడుగుల ఎత్తయిన ఒస్టాంకినో టీవీ టవర్‌ను భారత్‌, రష్యా జెండాల్లోని రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఇది ప్రపంచంలోనే ఎత్తయిన టీవీ టవర్లలో నాలుగో స్థానంలో ఉంది. ఇక మాస్కో చేరుకున్న అనంతరం మోదీ తన ఎక్స్‌ ఖాతాలో.. ‘‘భారత్‌, రష్యాల మధ్య మరింత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’’ అని పోస్ట్‌ చేశారు. ఇరుదేశాల మధ్య బలమైన బంధాలు ప్రజలకు ఎంతగానో లబ్ధిచేకూర్చుతాయన్నారు. మంగళవారం ఇరువురు నేతలు 22వ ‘భారత్‌-రష్యా’ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, ఇంధన, రక్షణ రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చలు జరపనున్నారు. మోదీ చివరిసారిగా 2019లో రష్యా పర్యటనకు వెళ్లారు. కాగా, జాతీయ, అంతర్జాతీయ సమస్యలు సహా పలు అంశాలపై తన మిత్రుడు పుతిన్‌తో సమగ్రంగా చర్చలు జరుపుతానని మోదీ పేర్కొన్నారు. శాంతి స్థాపన కోసం అవసరమైతే మద్దతు అందిస్తామన్నారు. మంగళవారం పుతిన్‌, మోదీ ముఖాముఖి చర్చలు జరుపుతారని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు. చర్చల తర్వాత పుతిన్‌, మోదీ సంయుక్త మీడియా ప్రకటనలేమీ ఉండవన్నారు. కాగా, రష్యా యుద్ధంలో పనిచేస్తున్న భారతీయులను సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ప్రధాని చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ సూచించింది.

Updated Date - Jul 09 , 2024 | 05:10 AM