Share News

Modi 3.0 Cabinet: మోదీ నూతన కేబినెట్‌లో చోటు దక్కని మాజీ మంత్రులు వీళ్లే!

ABN , Publish Date - Jun 09 , 2024 | 04:25 PM

మరికొద్ది సేపట్లో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ సర్కారు కొలువుతీరబోతోంది. దేశ ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 50 మంది వరకు కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయవచ్చంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఈసారి మోదీ కేబినెట్‌లో పలువురు మాజీ కేంద్ర మంత్రులు, ఆశావహులకు చోటుదక్కలేదని తెలుస్తోంది.

Modi 3.0 Cabinet: మోదీ నూతన కేబినెట్‌లో చోటు దక్కని మాజీ మంత్రులు వీళ్లే!
Narendra Modi 3.0

మరికొద్ది సేపట్లో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ సర్కారు కొలువుతీరబోతోంది. దేశ ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 50 మంది వరకు కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయవచ్చంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఈసారి మోదీ కేబినెట్‌లో పలువురు మాజీ కేంద్ర మంత్రులు, ఆశావహులకు చోటుదక్కలేదని తెలుస్తోంది. వారిలో కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ్ రాణేలకు ఈసారి మోదీ కేబినెట్‌లో చోటుదక్కలేదని జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. కాగా కాంగ్రెస్ దిగ్గజం శశిథరూర్‌పై గట్టి పోటీలో ఓడిపోయిన మాజీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కు కూడా తాజా కేబినెట్‌లో అవకాశం దక్కలేదని తెలుస్తోంది.


స్మృతి ఇరానీకి దక్కని ఛాన్స్!

లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ స్థానంలో కాంగ్రెస్ నాయకుడు కిషోరీ లాల్ శర్మ చేతిలో స్మృతి ఇరానీ ఏకంగా 1.6 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మోదీ ప్రభుత్వం 2.0లో ఆమె రెండోసారి మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ ఈసారి ఆమెకు నిరాశ తప్పలేదు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో అదే అమేథీలో రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ ఓడించిన విషయం తెలిసిందే.


ఇక హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినప్పటికీ అనురాగ్ ఠాకూర్‌కు ఈసారి కేబినెట్‌లో చోటుదక్కలేదని తెలుస్తోంది. గత కేబినెట్‌లో క్రీడా, సమాచార మరియు ప్రసార శాఖలను ఆయన నిర్వహించారు. అయితే నరేంద్రమోదీ సారధ్యంలోని నూతన కేబినెట్‌లో ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.


మరోవైపు మోదీ 2.0 ప్రభుత్వంలో నారాయణ్ రాణే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన మహారాష్ట్రలోని రత్నగిరి-సింధుదుర్గ్ లోక్‌సభ నుంచి విజయం కూడా సాధించారు. అయినప్పటికీ చోటు దక్కలేదని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.


వీరికి చోటు పక్కా..!

మోడీ 3.0 కేబినెట్‌లో కొందరు బీజేపీ నేతలకు చోటు ఇవ్వడం ఖాయంగా తెలుస్తోంది. ఈ జాబితాలో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, నితిన్ గడ్కరీ, మన్సుఖ్ మాండవియా, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, ప్రహ్లాద్ జోషి, కిరణ్ రిజిజు, సీఆర్ పాటిల్, ఎల్ మురుగన్, హర్దీప్ పూరి, మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ చౌహాన్, గజేంద్ర సింగ్ షెకావత్, సురేష్ గోపి, జితిన్ ప్రసాద్‌లకు చోటు దక్కిందని తెలుస్తోంది. ఇక ఎన్డీయే కూటమిలోని ఇతర పార్టీల విషయానికి వస్తే హెచ్‌డీ కుమారస్వామి, జయంత్ చౌదరి, ప్రతాప్ జాదవ్, రామ్ మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, సుదేశ్ మహతో, లల్లన్ సింగ్‌తో పాటు పలువురు పేర్లు ఖరారైనట్టు సమాచారం.

Updated Date - Jun 09 , 2024 | 04:25 PM