Share News

Bhatti: కేసీఆర్‌కు వ్యవస్థపై నమ్మకం లేదు..

ABN , Publish Date - Jun 17 , 2024 | 03:33 AM

విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించి మాజీ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అసెంబ్లీలో కోరినట్లుగానే న్యాయ విచారణ కమిషన్‌ను వేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్వతంత్ర వ్యవస్థగా విచారణ చేస్తున్నందు వల్ల అందులో ఎవరి జోక్యం ఉండదని తెలిపారు.

Bhatti: కేసీఆర్‌కు వ్యవస్థపై నమ్మకం లేదు..

  • జ్యుడీషియల్‌ కమిషన్‌ చైర్మన్‌కు విచారణ చేసే చట్టబద్ధత లేదనడం సరికాదు: భట్టి

  • కేసీఆర్‌కు భయం పట్టుకుంది: జీవన్‌రెడ్డి

  • విచారణను తప్పించుకోవాలనే.. నిరంజన్‌

జగిత్యాల/బోనకల్‌/హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించి మాజీ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అసెంబ్లీలో కోరినట్లుగానే న్యాయ విచారణ కమిషన్‌ను వేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్వతంత్ర వ్యవస్థగా విచారణ చేస్తున్నందు వల్ల అందులో ఎవరి జోక్యం ఉండదని తెలిపారు. జ్యుడీషియల్‌ కమిషన్‌ చైర్మన్‌కు విచారణ చేసే చట్టబద్ధత లేదని మాజీ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించడం.. ఆయనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదన్న భావనను కలిగిస్తోందన్నారు. ఇది రాచరిక వ్యవస్థ కాదన్న విషయం కేసీఆర్‌ గుర్తుంచుకోవాలని చెప్పారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలోని మోటమర్రి, పెద్దబీరవల్లి, తూటికుంట్ల గ్రామాల్లో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తామని, ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామని తెలిపారు.


గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టి కొందరు పెద్దలకు ప్రభుత్వ భూములను కట్టబెట్టే వెసులుబాటును కల్పించారని ఆరోపించారు. భూమిశిస్తుతోపాటు జమాబందీ నిర్వహించకుండా రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చారన్నారు. గ్రామాల్లో తాము రెవెన్యూ సదస్సులను నిర్వహించి వ్యవస్థను గాడిలో పెడతామన్నారు. కాగా, జస్టిస్‌ నరసింహారెడ్డి ఏం నివేదిక ఇస్తారోనని మాజీ సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. అందుకే ఉత్తర, దక్షిణ తెలంగాణ అంటూ కొత్త నాటకాన్ని తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ విద్యుత్తు ఉత్పాదన ప్రాజెక్టులన్నీ ఉత్తర తెలంగాణలోనే ఉన్నాయని, అందుకే రామగుండంలో నెలకొల్పాల్సిన ప్రాజెక్టును దక్షిణ తెలంగాణలోని దామరచర్లలో ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటూ కేసీఆర్‌ చేస్తున్న వాదన అర్థం లేనిదని కొట్టిపారేశారు.


కమిషన్‌పై ఆరోపణలు చేయడం, న్యాయవ్యవస్థను కించపరిచినట్లేనని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై దర్యాప్తు జరుపుతున్న జస్టిస్‌ ఘోష్‌ నుంచి విచారణను తప్పించుకునే ఎత్తుగడలో భాగంగానే కేసీఆర్‌ జస్టిస్‌ నర్సింహారెడ్డికి లేఖ రాశారని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ ఆరోపించారు. జస్టిస్‌ నర్సింహారెడ్డిని విచారణ నుంచి తప్పుకోవాలనడం కేసీఆర్‌ అహంభావానికి నిదర్శనమన్నారు. కేసీఆర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జస్టిస్‌ నర్సింహారెడ్డిని తప్పు పట్టడమంటే విద్యుత్తు ఒప్పందాలపై అవకతవకలు జరిగినట్లేనని స్పష్టమవుతోందని టీపీసీసీ లీగల్‌ సెల్‌ వైస్‌చైర్మన్‌ ఉమాశంకర్‌ అన్నారు. విచారణకు హాజరు కాకుండా సాకులు వెదకడంలోని ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కాగా, జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ లేవనెత్తిన అంశాలకు మాజీ సీఎం కేసీఆర్‌ వివరణ ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాజకీయ కక్ష సాఽధింపు కోసమే విద్యుత్తు కొనుగోళ్లపై విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారని కేసీఆర్‌ ఎదురుదాడికి దిగడం సహేతుకంకాదని అభిప్రాయపడ్డారు.

Updated Date - Jun 17 , 2024 | 03:33 AM