Share News

Hyderabad: చెట్టే కదా అని కొట్టేస్తే.. చర్యలు తప్పవు..!

ABN , Publish Date - Oct 24 , 2024 | 09:30 AM

నగరంలో చెట్ల సంరక్షణకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ చెట్టును కాపాడేందుకు వాల్టా చట్టానికి పదును పెడుతున్నారు. చెట్టే కదా అని కొట్టేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Hyderabad: చెట్టే కదా అని కొట్టేస్తే.. చర్యలు తప్పవు..!

- చెట్ల సంరక్షణకు ఉపయోగపడుతున్న వాల్టా చట్టం

- నరికేస్తే భారీగా జరిమానా విధిస్తున్న అధికారులు

- మరింత అవగాహన కల్పించాలంటున్న ప్రజలు

హైదరాబాద్: నగరంలో చెట్ల సంరక్షణకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ చెట్టును కాపాడేందుకు వాల్టా చట్టానికి పదును పెడుతున్నారు. చెట్టే కదా అని కొట్టేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పార్కులో మొక్కను విరిచినా, ఇంట్లో చెట్టు కొమ్మలు కొట్టేసినా జరిమానా విధిస్తున్నారు. ఇటీవలి కాలంలో కేబీఆర్‌ జాతీయ ఉద్యానవనానికి సంబంధించిన అటవీశాఖ అధికారులు ఇలాంటి ఫిర్యాదులతో అనేక కేసులు నమోదు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌(Jubilee Hills, Banjara Hills) డివిజన్‌లలో ఇలాంటి కేసులు అత్యధికంగా నమోదయ్యాయి.


ఇబ్బందులుంటే ఫిర్యాదు చేయాలి..

వాల్టా చట్టం ప్రకారం ఎవరెనా తమ ఇంటి ఆవరణలోని చెట్టును తమంతట తాము నరికేయకూడదు. ఆ చెట్టువల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురైతే విషయాన్ని ఆటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. అధికారులు పరిశీలించి నిజంగానే సమస్య ఉన్నట్లయితే చెట్టును కొట్టేయడం లేదా అక్కడి నుంచి తొలగించి మరోచోట ఏర్పాటు చేస్తారు. ఒక చెట్టును తొలగించడానికి రూ. 500, ప్రాసెసింగ్‌ రసుము చెల్లించాల్సి ఉంటుంది. అలా కాదని నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా వేలల్లో ఉంటుంది.


city4.jpg

అయితే వాల్టా చట్టం విషయంలో చాలా మందికి సరైన అవగాహన లేదు. చాలా మంది తమ ఇళ్లలో ఉండే చెట్లను కొట్టేస్తుంటారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 32లో ఉండే సమ్మిరెడ్డి తన ఇంటి ముందున్న మూడు చెట్లను విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్నాయనే కారణంతో నరికేయించారు. దీంతో అతడికి అధికారులు జరిమానా విధించారు. అయితే ఇలాంటి చట్టం ఉందని తనకు తెలియకపోవడంతోనే చెట్లను కొట్టేసినట్లు సమ్మిరెడ్డి అధికారులతో అన్నాడు. కాగా, కేవలం చెట్లు, మొక్కలకే కాకుండా భూమి, నీటికి సైతం ఈ చట్టం వర్తింస్తుందని పశ్చిమ మండల ప్రాంతానికి చెందిన ఓ ఆటవీ శాఖ అధికారి తెలిపారు.


జరిమానా విధించిన ఘటనల్లో కొన్ని..

- జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 76లో నివసించే ప్రసాద్‌ తన ఇంట్లోని సీతాఫలం చెట్లను కొట్టేయడంతో అటవీశాఖ అధికారులు అతడికి రూ.12 వేల జరిమానా విధించారు.

- బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 14లో ఓ వ్యాపారి తన ఇంటి ఆవరణలోని చెట్టు కొమ్మలను నరికేయడంతో రూ.10 వేల జరిమానా కట్టాల్సి వచ్చింది.

- గత ఏడాది బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12లోని ఎన్‌బీటీనగర్‌లో నివసించే హేమలత ఇంటిపక్కనున్న చెట్టు కొట్టేయగా రూ.12 వేల జరిమానా విధించారు.


అవగాహన కల్పించాలి

వాల్టా చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అనేక బస్తీల్లో అవసరం లేకున్నా చెట్లను కొట్టేస్తున్నారు. జరిమానా విధిస్తారన్న విషయం తెలిస్తే చెట్లను కొట్టకుండా ఉంటారు.

- సుధాకర్‌, ఇందిరానగర్‌

వాల్టా చట్టంతో కాపాడుకునే అవకాశం

పచ్చదనం, చెట్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మరింత అవగాహన పెరగాలి. కొత్త వాటిని ఎలాగో నాటడం లేదు. కనీసం ఉన్న చెట్లను నరికివేయకుండా కాపాడుకోవాలి. వాల్టా చట్టంతో కొంతమేరకు చెట్లను కాపాడుకునే అవకాశం ఉంది.

- రాకేష్‌, ఫిలింనగర్‌


ఇదికూడా చదవండి: చెప్పినట్లుగానే దరణిని మారుస్తున్నాం: మంత్రి పొంగులేటి

ఇదికూడా చదవండి: తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలనూ తిరుమలలో అనుమతించాలి

ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

ఇదికూడా చదవండి: Bandi Sanjay: భయపెట్టాలని చూస్తే భయపడతామా?

Read Latest Telangana News and National News

Updated Date - Oct 24 , 2024 | 09:30 AM