Share News

TG Politics: టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా.. కాంగ్రెస్ ఎంపీ ప్రతిపాదన!

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:24 AM

పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు బొర్లకుంట వెంకటేశ్‌ నేత బీజేపీ వైపు చూస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టికెట్‌ ఇస్తే బీజేపీలో చేరతానని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి ప్రతిపాదన పెట్టారని సమాచారం. దీంతో పెద్దపల్లి అభ్యర్థిగా ప్రకటించిన గొమాసే శ్రీనివాస్‌ను మార్చి వెంకటేశ్‌ నేతకు టికెట్‌ ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది..

TG Politics: టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా.. కాంగ్రెస్ ఎంపీ ప్రతిపాదన!

  • రెండు నెలల క్రితం బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన వెంకటేశ్‌ నేత

  • టికెట్‌ దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరం

  • టికెట్‌ ఇస్తే బీజేపీలో చేరేందుకు ప్రతిపాదన

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు బొర్లకుంట వెంకటేశ్‌ నేత.. బీజేపీ (BJP) వైపు చూస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టికెట్‌ ఇస్తే బీజేపీలో చేరతానని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి ప్రతిపాదన పెట్టారని సమాచారం. దీంతో పెద్దపల్లి అభ్యర్థిగా ప్రకటించిన గొమాసే శ్రీనివాస్‌ను మార్చి వెంకటేశ్‌ నేతకు టికెట్‌ ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఎక్సైజ్‌ శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన వెంకటేశ్‌ నేత రాజకీయాలపై మక్కువతో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి చెందారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో మాజీ ఎంపీ వివేక్‌కు టికెట్‌ను నిరాకరించిన బీఆర్‌ఎస్‌ పార్టీ అప్పటికప్పుడే వెంకటేశ్‌ నేతను పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్‌ ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్‌పై గెలుపొందారు. అప్పటినుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, పార్టీ ఆదేశాల మేరకు పార్లమెంట్‌లో పలు ప్రశ్నలను లేవనెత్తారు.

netha-venkatesh.jpg

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయమై సహచర ఎంపీలతో కలిసి పోరాటం చేశారు. అయితే బీఆర్‌ఎస్‌లో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్సీలకు తగిన ప్రాధాన్యం లేకుండా చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలనే బాధ్యులుగా చేశారు. పార్లమెంట్‌ సభ్యులు తన పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించాలంటే అక్కడి పార్టీ ఎమ్మెల్యేలు గానీ, నియోజకవర్గ ఇన్‌చార్జీలను సంప్రదించకుండా పర్యటించే అవకాశం లేకుండా చేయడంతో ఎంపీలు రాజకీయంగా స్వతంత్రంగా పట్టు సాధించలేకపోయారు. నవంబరు, డిసెంబరు మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ స్వీప్‌ చేసింది. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో బొర్లకుంట వెంకటేశ్‌ నేతకు బదులు మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు కొప్పుల ఈశ్వర్‌కు పార్టీ టికెట్‌ ఇవ్వాలని అధినేత నిర్ణయించారు. ఆ మేరకు ఆయనకు సంకేతాలు ఇవ్వడంతో వెంకటేశ్‌ నేత తనకు టికెట్‌ రాదని గ్రహించి బీజేపీ లేదా కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ఆయన రెండు మాసాల క్రితం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయన చేరికతో పెద్దపల్లి పార్టీ టికెట్‌ వెంకటేశ్‌ నేతకే దక్కనున్నదని, పార్టీ టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాతనే ఆయన పార్టీలో చేరారనే ప్రచారం జరిగింది. ఆయన చేరిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ తనయుడు గడ్డం వంశీకృష్ణ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో ఖంగుతిన్న వెంకటేశ్‌ నేత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాటి నుంచి ఇప్పటివరకు నియోజకవర్గంలో అడుగు పెట్టకపోవడం గమనార్హం.

పార్టీ పెద్దల వద్ద ప్రతిపాదన..

వంశీకృష్ణకు టికెట్‌ ఇవ్వడాన్ని మాదిగ సామాజిక వర్గానికి చెందిన పార్టీ నాయకులు, మాదిగ కుల సంఘాలు వ్యతిరేకించడంతో అభ్యర్థిని మారుస్తారేమోననే ఆశలు టికెట్‌ ఆశించిన నేతలందరిలో మొలకెత్తాయి. కానీ పార్టీ అవేమి పట్టించుకోలేదు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్‌ అంతా వంశీకృష్ణ గెలుపు కోసం పనిచేయాలని అధిష్ఠానం ఆదేశించింది. కానీ వెంకటేశ్‌ నేత మాత్రం నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడడం లేదు. అటు బీఆర్‌ఎస్‌, ఇటు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ దక్కకపోవడంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీకి సరైన అభ్యర్థి లేకపోవడంతో పార్టీలో చేరిన కాంగ్రెస్‌ పార్టీ టీపీసీసీ కార్యదర్శి గొమాసే శ్రీనివాస్‌కు బీజేపీ టికెట్‌ ప్రకటించింది. ఆయన ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ప్రోద్బలంతో టికెట్‌ సాధించి పదిహేను రోజుల నుంచి నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు.

పార్టీ నాయకులు, క్యాడర్‌ను కలవడంతో పాటు వివిధ సంఘాలను కలిసి తనను గెలిపించేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. గొమాసె శ్రీనివాస్‌, తన సామాజిక వర్గం నేతకాని కావడంతో బీజేపీ టికెట్‌ తనకు ఇవ్వాలని వెంకటేశ్‌ నేత బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి ప్రతిపాదన పెట్టారని సమాచారం. దీంతో ఆ పార్టీ పెద్దపల్లి అభ్యర్థి గొమాసే శ్రీనివాస్‌ పక్కన పెట్టి వెంకటేశ్‌ నేతకు టికెట్‌ ఇస్తే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీనిస్తారా లేదా అని రహస్యంగా సర్వే చేయిస్తున్నట్లుగా తెలుస్తున్నది. మరోవైపు పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి ప్రచార సామగ్రిని అన్ని నియోజకవర్గాలకు సరఫరా చేయగా, పెద్దపల్లి నియోజకవర్గానికి సరఫరా చేయలేదని తెలుస్తున్నది. ఒకవేళ బీజేపీ టికెట్‌ ఇస్తే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వెంకటేశ్‌ నేత భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీ అందుకు నిరాకరిస్తే మాత్రం ప్రస్తుతం కొన్ని రోజులు సైలెంట్‌గానే ఉండే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.

Updated Date - Apr 19 , 2024 | 07:47 AM