Share News

Mancherial: యువకుడి బొటన వేలు కొరికి ఎత్తుకెళ్లిన శునకం..

ABN , Publish Date - Jun 01 , 2024 | 03:38 AM

రాష్ట్రంలో వీధి కుక్కల స్వైరవిహారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం వీధి కుక్కలు రెచ్చిపోయడంతో ఇద్దరు బాలురుతో సహా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Mancherial: యువకుడి బొటన వేలు కొరికి ఎత్తుకెళ్లిన శునకం..

మంచిర్యాల, భగత్‌నగర్‌, కొల్లాపూర్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వీధి కుక్కల స్వైరవిహారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం వీధి కుక్కలు రెచ్చిపోయడంతో ఇద్దరు బాలురుతో సహా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సున్నంబట్టి వాడలో మార్బుల్‌, టైల్స్‌ పనిచేస్తూ జీవనం సాగించే తాళ్లపెల్లి ప్రసాద్‌ అనే యువకుడిపై వీధి కుక్క దాడి చేసింది. అతడి ఎడమ చేతి బొటన వేలును కొరికి ఎత్తుకెళ్లింది. అనంతరం సమీపంలోని బృందావనం కాలనీలో ఓ ఇంటికి పెయింటింగ్‌ చేస్తున్న నలుగురు కూలీలపై దాడి చేయడంతో వారు స్వల్పగా గాయపడ్డారు.


బొటన వేలు కోల్పోయిన ప్రసాద్‌ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో దాడిలో నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మునిసిపాలిటీలోని 11వ వార్డుకు చెందిన నరేశ్‌, శ్రుతి దంపతుల కుమారుడు ధనుష్‌.. ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేయడంతో బాలుడి ముఖంపై తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న త్రిలోక్‌ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.

Updated Date - Jun 01 , 2024 | 03:38 AM