ఇన్విజిలేటర్ను బెదిరించిన యువకులపై పోలీసులకు ఫిర్యాదు
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:40 AM
పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు కాపీకి పాల్పడకుండా అడ్డుకున్న ఓ ఇన్విజిలేటర్ను బెదిరించిన యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డీఈవో కేవీఎన్ కుమార్ గరువారం తెలిపారు.

తిరుపతి(విద్య), మార్చి 27(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు కాపీకి పాల్పడకుండా అడ్డుకున్న ఓ ఇన్విజిలేటర్ను బెదిరించిన యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డీఈవో కేవీఎన్ కుమార్ గరువారం తెలిపారు. ‘ఎస్ రామాపురం ఎంపీపీ స్కూల్ ఎస్జీటీ డి. మురుగేషన్ ఈనెల 24న పిచ్చాటూరు- ఎ సెంటర్ జడ్పీ ఉన్నత పాఠశాల కేంద్రంలో టెన్త్ పరీక్షలకు ఇన్విజిలేటర్గా పనిచేశారు. కాపీకి యత్నించిన విద్యార్థులను మందలించి.. అలాంటి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. విధుల అనంతరం ఆయన తిరుగు ప్రయాణంలో కీలపూడి వద్ద కొందరు యువకులు ఆయన్ను అడ్డగించి బెదిరించారు. భయాందోళనకు గురైన మురుగేషన్ ఆస్పత్రిపాలయ్యారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పిచ్చాటూరు ఎంఈవోను ఆదేశించాం’ అని డీఈవో వివరించారు. ఆ మేరకు ఆయన ఫిర్యాదు చేశారన్నారు. పదో తరగతి పరీక్షల్లో నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు విద్యాశాఖ అండగా ఉంటుందని, ఎవరూ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గరాదని డీఈవో స్పష్టం చేశారు.