Raghuramakrishna Raju : బుల్లెట్ దిగిందా.. లేదా.. అన్నట్టు మాట్లాడాలి..
ABN , Publish Date - Mar 07 , 2025 | 08:25 AM
పదే పదే బెల్ మోగిస్తున్నా పట్టించుకోకుండా సుదీర్ఘంగా మాట్లాడుతున్న జనసేన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తీరుపై డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణ రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో ఎమ్మెల్యే మాధవి తీరుపై డిప్యూటీ స్పీకరు అసహనం
అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): పదే పదే బెల్ మోగిస్తున్నా పట్టించుకోకుండా సుదీర్ఘంగా మాట్లాడుతున్న జనసేన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తీరుపై డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణ రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గురువారం శాసనసభలో మంత్రులు అచ్చెన్న, ఆనం, పవన్ కల్యాణ్ తరఫున నాదెండ్ల మనోహర్ ఆయా శాఖలకు గ్రాంట్లు, నిధుల మంజూరు కోసం ప్రవేశపెట్టిన డిమాండ్లపై డిప్యూటీ స్పీకరు చర్చకు అనుమతించారు. ముందుగా ఎమ్మెల్యే లోకం నాగమాధవి దాదాపు అరగంట మాట్లాడిన తర్వాత.. ఇంకా కొనసాగిస్తుడడంతో డిప్యూటీ స్పీకర్ బెల్ మోగిస్తూ.. ‘ఎంతసేపు మాట్లాడామనేది కాదు.. ఎంతమంది వింటున్నారో కూడా మీరు చూడాలి. మీరు మాట్లాడుతుంటే సభ్యులెవరూ వినకుండా ఎవరి గొడవలో వాళ్లున్నారు. బుల్లెట్ దిగిందా? లేదా? అన్నట్టుండాలే తప్ప ఎంత సమయం తినేశాననేది కాదు’ అని అన్నారు. కాసేపటి తర్వాత మళ్లీ బెల్ మోగిస్తున్నప్పటికీ.. నాగమాధవి ప్రసంగాన్ని కొనసాగిస్తుండటంతో ఆమె మైకును కట్ చేశారు.