ఈకేవైసీ తప్పనిసరి!
ABN , Publish Date - Mar 26 , 2025 | 02:10 AM
రేషన్ కార్డుల్లో చేర్పులు, మార్పులకు ప్రభుత్వం త్వరలో అవకాశం కల్పించనుంది. అందుకోసం ప్రస్తుతం ఉన్న తెల్లరేషన్ కార్డుదారులకు ఈకేవైసీని చేపట్టింది. దీనివలన రేషన్లో అక్రమాలకు కూడా అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.

త్వరలో రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : రేషన్ కార్డుల్లో చేర్పులు, మార్పులకు ప్రభుత్వం త్వరలో అవకాశం కల్పించనుంది. అందుకోసం ప్రస్తుతం ఉన్న తెల్లరేషన్ కార్డుదారులకు ఈకేవైసీని చేపట్టింది. దీనివలన రేషన్లో అక్రమాలకు కూడా అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. సాధారణంగా కార్డు కలిగిన కుటుంబంలో ఒకరు వేలిముద్ర వేసి ప్రతినెలా రేషన్ తీసుకుంటున్నారు. మిగిలిన సభ్యుల్లో కొందరు చదువులు, ఉద్యోగాలు, ఇతర పనుల నిమిత్తం వేరే ప్రాంతాల్లో ఉంటుండటంతో అటువంటి వారి వేలిముద్రలు అప్డేట్ కాలేదు. దీంతో ప్రస్తుతం తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని అలాం టి సభ్యులందరిచేత తప్పనిసరిగా ఈకేవైసీ చేయించే విధంగా చర్యలు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 6.61 లక్షల రేషన్కార్డులు ఉండగా వాటిలో 19.37 లక్షల మంది సభ్యులు ఉన్నారు. అందులో ఇప్పటివరకు 17.31లక్షల మంది ఈకేవైసీ చేయించుకోగా మరో రెండు లక్షల మంది చేయించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం రేషన్ కార్డుదారులు ఉన్న పరిధిలోని డీలర్ల ద్వారా ఈకేవైసీ ప్రక్రియను చేపట్టారు. అయితే నెలల తరబడి ఈ పోస్లో వేలి ముద్రలు వేయని వారు మాత్రమే ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెప్తున్నారు. దీనిపై అవగాహన లేకుండా కార్డుదారులంతా డీలర్ల వద్దకు ఒకేసారి వస్తుండటంతో ప్రక్రియలో జాప్యం జరుగుతోంది.