అక్రమాల అ‘టెండర్’
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:37 AM
రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)కి చెందిన హై ఎండ్ బస్సులలో అటెండర్ల కోసం పిలిచిన టెండర్లపై వివాదం నెలకొంది.

ఆర్టీసీ హై ఎండ్ బస్సుల్లో అటెండర్ల కోసం టెండర్లు
టెండర్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆర్టీసీ ఎండీ, ఉన్నాతాధికారులకు కాంట్రాక ్టర్ ఫిర్యాదు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)కి చెందిన హై ఎండ్ బస్సులలో అటెండర్ల కోసం పిలిచిన టెండర్లపై వివాదం నెలకొంది. సిండికేట్ల ప్రయోజనాల కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. టెండర్లలో పాలు పంచుకున్న ఒక కాంట్రాక్టర్ టెండర్లు లోపభూయిష్టంగా జరిగాయని ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో కొంతమంది ఆర్టీసీ అధికారుల ప్రయోజనాలు కూడా దాగున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ ఎన్టీఆర్ రీజియన్ పరిధిలోని విజయవాడ డిపోలో ఇటీవల హై ఎండ్ బస్సులైన అమరావతి, డాల్ఫిన్ క్రూస్, వెన్నెల స్లీపర్, ఇంద్ర బస్సుల్లో అటెండర్ల కోసం టెండర్లను పిలిచారు. మొత్తం 86 మంది అన్స్కిల్డ్ అటెండర్లు, 4 సెమీ స్కిల్డ్ సూపర్వైజర్లు, 2 స్కిల్డ్ టీవీ టెక్నీషియన్ల కోసం ఏజెన్సీల నుంచి టెండర్లను ఆహ్వాననించారు. వీరు హై ఎండ్ బస్సుల్లో ఆడియో, వీడియోలను ఆపరేట్ చేయడం, ఆర్టీసీ సరఫరా చేసే మినరల్ బాటిల్స్, చాక్లెట్లు, దుప్పట్లు, న్యూస్ పేపర్లను ఉచితంగా ప్రయాణికులకు సరఫరా చేయటంతో పాటు దీనికి సంబంధించిన ఖాతాలను నిర్వహించాలి. ప్రయాణికుల కోరిక మేరకు వారి లగేజీని బస్సులో భద్రపరచటం, బస్సు నుంచి దించటం, పాసింజర్ల లగేజీని గుర్తించటానికి ఐడెంటిఫికేషన్ కార్డులను ఉపయోగించటం, స్నాక్స్, కూల్డ్రింక్స్ను ఎంఆర్పీ రేటుకు విక్రయించటం, శుభ్రపరిచిన ఊలు దుప్పట్లను ప్రయాణికులకు అందించటం, వారానికి ఒకసారి ఉతికిన కర్టెన్లను బస్సులో ఏర్పాటు చేయటం, బస్సు బయలుదేరే ముందు, వచ్చిన తర్వాత సీట్లలో దుమ్మును దులిపి బాడీ, అద్దాలు, లోపల ఫ్లోరింగ్లను తడిగుడ్డతో తుడిచి పొడిగుడ్డతో తుడవటం, ఎయిర్ఫ్రె్షనర్స్ ఉపయోగించటం, బస్సుల్లో డీవీడీ ఆడియో-వీడియో సిస్టమ్స్ను నిర్వహించటం, వాటికి రిపేర్లు వస్తే బాగు చేయించటం వంటి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రైవేటు ఏజెన్సీ కోసం ఆర్టీసీ విజయవాడ డిపో అధికారులు టెండర్లు పిలిచారు. టెండర్లలో 49 బిడ్లు నిలిచాయి. వీటిలో 7 నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పక్కన పెట్టారు. 42 అర్హత సాధించాయి. పక్కన పెట్టిన 7లో 3 బిడ్లను మళ్లీ తీసి కలిపారు. మొత్తం 45 బిడ్లను అర్హమైనవిగా తేల్చారు.
గత వైసీపీ ప్రభుత్వం నుంచి పాతుకుపోయిన సిండికేట్
వీటీలో కిందటి వైసీపీ ప్రభుత్వం నుంచి పాతుకుపోయిన కాంట్రాక్టర్ల సిండికేట్ కూడా ఉందని తెలుస్తోంది. అదే పాత సిండికేట్కే టెండర్లు రావటం వివాదానికి దారితీసింది. సిండికేట్ కాంట్రాక్టర్లు వేర్వేరు పేర్లతో బహుళ టెండర్లు వేశాయని కొందరు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు సిండికేట్ ప్రయోజనాలను కాపాడారని విమర్శించారు.
సమగ్ర విచారణ జరపాలి
అటెండర్ల టెండర్లలో జరిగిన లోపాలపై ఆర్టీసీ ఎండీ, విజయవాడ ఈడీ, ఆర్టీసీ ఆర్ఎం, టెండర్ కమిటీకి వై.శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశారు. టెండర్లు పిలిచినప్పటి నుంచి కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం ఆర్టీసీ అధికారులు అనేక సవరణలు ఇచ్చారని ఆరోపించారు. తాము టెండర్ ఫారాన్ని రూ.5,900కు కొనుగోలు చేశామని, ఆ తర్వాత సిండికేట్ ప్రయోజనాల కోసం రూ.1770కు తగ్గించారన్నారు. సిండికేట్ వేర్వేరు పేర్లతో లెక్కకు మించి వేయటం వల్ల రూ.5,900 ధర ఉంటే వారిపై భారం పడుతుందని, తర్వాత తగ్గించారన్నారు. ఒకే వ్యక్తి టెం డర్ ఫారం తీసుకోవాలని నిబంధనల్లో స్పష్టంగా ఉన్నా, ఒకే వ్యక్తి వేర్వే రు పేర్లతో టెండర్లు తీసుకున్నారని ఆరోపించారు. ఎక్స్పీరియన్స్-శాటి్సఫ్యాక్టరీ సర్టిఫికెట్లు, ఈఎండీ ధర రూ.9,30,000, టర్నోవర్ రూ.కోటి, ప్రాఫిట్ మార్జిన్ను 7శాతంగా నిర్ణయించారని తెలిపారు. సవరణల పేరుతో ఇష్టానుసారంగా మార్పులు చేసి చెల్లుబాటు కాని టెండర్లను క్వాలిఫై చేశారన్నారు. ఏ బిడ్ను తీసినా కాంట్రాక్టర్ల త్రయం సిండికేట్లు వేయించినవే వస్తున్నాయని, సిండికేట్ త్రయం హాల్లో కూర్చున్న కాంట్రాక్టర్లపై చంపేస్తామంటూ తొడకొట్టి బెదిరించిం దని పేర్కొన్నారు. టెండర్ల ప్రక్రియపైనా, కాంట్రాక్టర్ల సిండికేట్ త్రయం బెదిరింపులపైనా సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.