విజి‘లెన్స్’
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:43 AM
పోలవరం కాలువ మట్టి తవ్వకాలపై విజిలెన్స్ విచారణ ముమ్మరంగా జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం మట్టిని అడ్డగోలుగా తవ్వేశారు. విజయవాడ రూరల్ మండలం, గన్నవరం మండలాల పరిధిలో బరితెగించి మరీ అప్పటి వైసీపీ నాయకుల అనుయాయులు మట్టిని తవ్వుకుపోయారు. పోలవరం కాలువ కట్ట మీదకు భారీ ఎత్తున ప్రొక్లెయిన్లను తీసుకువచ్చి రాత్రి పగలు తేడా లేకుండా తవ్వేశారు. చూస్తుండగానే గుట్టలను కరిగించేశారు.

పోలవరం మట్టి తవ్వకాలపై విచారణ ముమ్మరం
- విజయవాడ రూరల్, గన్నవరం మండలాల్లో భారీగా అక్రమ మైనింగ్
- వైసీపీ ప్రభుత్వ హయాంలో కాలువ గట్లు మాయం
- కూటమి ప్రభుత్వం రాకతో రంగంలోకి విజిలెన్స్ బృందాలు
- ఎంత మట్టి తరలిపోయిందో లెక్క తేల్చేపనిలో బిజీ
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
పోలవరం కాలువ మట్టి తవ్వకాలపై విజిలెన్స్ విచారణ ముమ్మరంగా జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం మట్టిని అడ్డగోలుగా తవ్వేశారు. విజయవాడ రూరల్ మండలం, గన్నవరం మండలాల పరిధిలో బరితెగించి మరీ అప్పటి వైసీపీ నాయకుల అనుయాయులు మట్టిని తవ్వుకుపోయారు. పోలవరం కాలువ కట్ట మీదకు భారీ ఎత్తున ప్రొక్లెయిన్లను తీసుకువచ్చి రాత్రి పగలు తేడా లేకుండా తవ్వేశారు. చూస్తుండగానే గుట్టలను కరిగించేశారు. పోలవరం కాలువ గట్టు వెంబడే ఉన్న రోడ్డుపైనే మట్టిని నింపుకున్న టిప్పర్లు బారులు తీరేవి అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రోజూ వెయ్యికి పైగా టిప్పర్లలో పోలవరం కాలువ గట్టు మట్టి తరలిపోయేది. అధికారం ఉందన్న అహంకారంతో వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా పోలవరం కాలువ మట్టిని తవ్వుకుపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పోలవరం మట్టి తరలింపు వ్యవహారాల లెక్క తేల్చేందుకు విజిలెన్స్ను రంగంలోకి దించింది. విజయవాడ రూరల్, గన్నవరం మండలాల పరిధిలో విజిలెన్స్ బృందాలు కొద్ది రోజులుగా పోలవరం కాలువ గట్టును ఎంత కొల్లగొట్టారన్నదానిపై కొలతలు తీసుకుంటూ, ఎంత మట్టి తరలిపోయిందో అంచనా వేస్తున్నాయి. ఇరిగేషన్ శాఖ అధికారులు గతంలో ఇచ్చిన అనుమతులు కాకుండా.. అనుమతులు లేకుండా సాగించిన తవ్వకాలపై విజిలెన్స్ బృందాలు దృష్టి సారించాయి. స్థానికంగా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులపై కూడా దృష్టి పెట్టాయి. స్థానిక గ్రామాల వారిని కూడా విచారిస్తూ ఎవరు తవ్వకాలు జరిపారు? ఎప్పుడు జరిపారు? వంటి వివరాలను తెలుసుకుంటున్నాయి. మరో వారం రోజుల్లో పోలవరం కాలువ గట్టుపై ఎంత మేర అక్రమ మైనింగ్ జరిగిందో విజిలెన్స్ అధికారులు లెక్కలు తేల్చనున్నారు.