కాఫీ పూతకు కలిసొచ్చిన వర్షాలు
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:20 PM
గిరిజన ప్రాంతంలో మార్చిలో కురిసిన వర్షాలు కాఫీ పూతకు అనుకూలించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చింతపల్లి, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో మార్చిలో కురిసిన వర్షాలు కాఫీ పూతకు అనుకూలించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గిరిజన ప్రాంతలో సాధారణంగా ఫిబ్రవరి, మార్చిలో వర్షాలు కురుస్తాయి. కాఫీ పంటకు ఈ వర్షాలు అత్యంత కీలకం. మార్చిలో కురిసిన వర్షాలు కాఫీ దిగుబడులపై ప్రభావం చూపుతాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 12.6 మిల్లీ మీటర్లు, మార్చిలో 21.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మార్చిలో కురిసిన వర్షాలకు ప్రస్తుతం కాఫీ తోటల్లో విస్తారంగా పూత వచ్చింది. ఏప్రిల్లో కురిసే వర్షాలు పూత దశ నుంచి పిందె దశకు దోహదపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాఫీ దిగుబడులు పెరగాలంటే గిరిజన రైతులు తోటల్లో వేసవి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, శాస్త్రవేత్త డాక్టర్ చెట్టి బిందు తెలిపారు.