Groundwater భూగర్భ జలాలను పెంపొందించాలి
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:18 PM
Groundwater must be developed భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కొంకడివరంలో ఫాంపాండ్స్ పనులను ప్రారంభించారు.

నీటిని వృథా చేయరాదు
ఫాంపాండ్స్ నిర్మాణాలకు చొరవ చూపాలి
గరుగుబిల్లి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కొంకడివరంలో ఫాంపాండ్స్ పనులను ప్రారంభించారు. నీటి నిల్వలను పెంచేందుకు అవసరమైన ఫాంపాండ్స్ నిర్మాణాలకు ‘ఉపాధి’లో మొదటి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలని సూచించారు. రైతులకు ఉపయోగపడే పనులకు ఉపాధి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.
ఆయిల్పామ్పై దృష్టి
జిల్లాలోని రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. కొంకడి వరంలో ఉపాధి హామీ పథకంలో సాగు చేస్తున్న పామాయిల్ను పరిశీలించారు. వరిపైనే కాకుండా ఉద్యాన పంటలు, పామాయిల్, జీడి మొక్కల పెంపకంతో అధిక లాభాలు పొందొ చ్చన్నారు. పాడి రైతులకు సహాయ సహకారాలు అందిస్తామని, గోకులాలకు సంబంధించి షెడ్లు నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. లాభసాటి పంటలపై ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహ కాలు అందిస్తుందన్నారు. అనంతరం ఉపాధి నిధులతో నిర్మించిన గోకులాల షెడ్లును ఆయన పరిశీలించారు.
కలెక్టర్ దృష్టికి వేతనదారుల సమస్యలు
ఉపాధి పనుల నిర్వహణకు కొంతమేర సడలింపు ఇవ్వాలని కొంకడివరం గ్రామానికి చెందిన వేతనదారులు కలెక్టర్ను కోరారు. ఎండల నేపథ్యంలో రెండు పూటలా పనులు నిర్వహించ లేకపోతున్నామని తెలిపారు. ఉదయం పూట నిర్వహిస్తే కొంతమేర సౌకర్యంగా ఉంటుందన్నారు. సిబ్బంది ముందస్తుగా అందించిన కొలతల మేరకు పనులు నిర్వహిస్తే రెండో పూట హాజరు కానక్కర్లేదని కలెక్టర్ తెలిపారు. వేతనదారులు వడదెబ్బకు గురికాకుండా చూడాలని, పనుల ప్రాంతంలో నీడతో పాటు తాగునీరు, అత్యవసర వైద్య సౌకర్యం కల్పించాలని డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఎంపీడీవో జి.పైడితల్లిని ఆదేశించారు. రెండు నెలలకు పైగా వేతనాలు అందలేదని కూలీలు తెలపగా.. ఈ నెలాఖరులోగా చెల్లింపులు జరుగుతాయని భరోసా ఇచ్చారు. కొంకడివరం ప్రధాన రహదారి నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.