Polamamba ముగిసిన పోలమాంబ జాతర
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:18 PM
Polamamba Festival Concludes ఉత్తరాంధ్రుల ఆరాధ్యదేవత పోలమాంబ సంబరాలు ముగిశాయి. మంగళవారం పదోవారం జాతరను ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గోముఖి నది తీరాన కోళ్లు, చీరలు, పసుపు కుంకుమలతో మొక్కులు చెల్లించుకున్నారు.

మక్కువ, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్యదేవత పోలమాంబ సంబరాలు ముగిశాయి. మంగళవారం పదోవారం జాతరను ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గోముఖి నది తీరాన కోళ్లు, చీరలు, పసుపు కుంకుమలతో మొక్కులు చెల్లించుకున్నారు. వనం గుడి వద్ద ఉన్న వేపచెట్టుకు మహిళలు కుంకుమ పూజలు చేశారు. ఆఖరి వారం కావడంతో వేద పండితులు మంత్రోచ్ఛరణల నడుమ వనంగుడి వద్ద మహా చండీ హోమం నిర్వహించారు. ఈ పూజల్లో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సుమారు 5 వేల మందికి భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. చండీహోమంలో పాల్గొన్న వారికి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ ఈవో వి.వి.సూర్యనారాయణ ఏర్పాట్లు చేశారు. సాలూరు రూరల్ సీఐ పి.రామకృష్ణ, ఎస్ఐ వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు బందోబస్తు నిర్వహించారు. ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ తిరుపతిరావు, టీడీపీ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల నాయుడు, ఎంపీటీసీ సభ్యుడు పోలినాయుడు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.