Share News

ప్రతి గింజా కొంటాం

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:05 AM

రాష్ట్రంలోనే రబీ సాగులో అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి అయ్యే జిల్లా పశ్చిమ గోదావరి. రొయ్మ, చేపల సాగు అధికం కావడంతో వరిసాగు తగ్గింది. లేదంటే మరింత ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్న జిల్లా. అయినప్పటికీ ప్రస్తుత రబీ సీజన్‌లో ఆరు లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక చేసింది.

ప్రతి గింజా కొంటాం

రబీలో ప్రణాళిక సిద్ధం చేసిన ప్రభుత్వం

జిల్లాలో ఆరు లక్షల టన్నుల లక్ష్యం

అధికమైనా కొనుగోలుకు సిద్ధం

రెండు రోజుల వ్యవధిలోనే సొమ్ములు

ఖరీఫ్‌లో విజయవంతంగా అమలు

రబీ సాగులోనూ అదే బాట.. 348 కొనుగోలు కేంద్రాలు

(భీమవరం–ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలోనే రబీ సాగులో అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి అయ్యే జిల్లా పశ్చిమ గోదావరి. రొయ్మ, చేపల సాగు అధికం కావడంతో వరిసాగు తగ్గింది. లేదంటే మరింత ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్న జిల్లా. అయినప్పటికీ ప్రస్తుత రబీ సీజన్‌లో ఆరు లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక చేసింది. పౌర సరఫరాల కార్పొరేషన్‌ ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. డివిజన్‌ల వారీగా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ధాన్యం విక్రయించడానికి రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిబంధనలను సడలించారు. గడిచిన ఖరీఫ్‌లో విజయవంతంగా అమలు చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన విధానం వల్ల ఖరీఫ్‌లో రైతులు సునాయాసంగా ధాన్యాన్ని అమ్ముకోగలిగారు. రెండు రోజుల వ్యవధిలోనే రైతు ఖాతాల్లో సొమ్ములు జమ అయ్యాయి. ప్రస్తుత రబీ సీజన్‌లో అదే తరహాలో సొమ్ములు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో రెవెన్యూ డివిజన్‌ల వారీగా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్‌ మేనేజర్‌ శివరామప్రసాద్‌ డివిజన్‌ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సిబ్బందికి సాంకేతిక శిక్షణ ఇస్తున్నారు.

348 కొనుగోలు కేంద్రాలు సిద్ధం

జిల్లాలో 348 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయనున్నారు. సహకార సంఘాలు పర్యవేక్షించ నున్నాయి. ఏప్రిల్‌ మొదటి వారంలోనే తాడేపల్లిగూడెంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే తాడేపల్లిగూడెం రూరల్‌ మండలంలో రబీ ధాన్యం అందుబాటులోకి వచ్చాయి. తూర్పుగోదావరి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. డెల్టా ప్రాంతంలో ఏప్రిల్‌ మూడో వారానికి వరికోతలు పూర్తి కానున్నాయి. అదేనెలలో కొనుగోళ్లు పూర్తిచేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రైతులు తమకు నచ్చిన మిల్లుకు ధాన్యం విక్రయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఫలితంగా రైతు కష్టాలు తొలగిపోయాయి. ముందుగానే మిల్లర్‌ వద్దకు వెళ్లి సంచులను తెచ్చుకుంటున్నారు. ఒబ్బిడి అయిన వెంటనే మిల్లుకు తరలిస్తున్నారు. అక్కడ నమోదైన తక్షణమే రైతు ఖాతాల్లో సొమ్ములు జమ అయిపోతున్నాయి. గత ప్రభుత్వంలో తూకం వేసిన తర్వాత ఏ మిల్లుకు కేటాయిస్తారో తెలిసేది. ఒకవైపు సంచుల ఇబ్బంది, మరోవైపు మిల్లు కేటాయింపులో స్పష్టత లేకపోవడం వంటి కారణాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారు.

నిబంధనలు సడలించిన ప్రభుత్వం

వైసీపీ పాలనలో ఒక మండలంలో ఉత్పత్తి అయ్యే ధాన్యం మరో మండలంలోని మిల్లుకు తరలించేవారు. వైసీపీ నేతల సిఫారసు ఉన్న మిల్లులకు అధికంగా ధాన్యం తరలిపోయా యన్న విమర్శలు వెల్లువెత్తాయి. రైతులకు సకాలంలో సొమ్ములు జమయ్యేవి కావు. రైతుపై ఆధారపడ్డ వ్యాపారాలన్నీ కుదేలయ్యా యి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిబంధనలను సడలించింది. మిల్లును రైతే ఎంపిక చేసుకుంటున్నారు. సొమ్ములు సక్ర మంగా జమ అయిపోతున్నాయి. తాజాగా రబీలోనూ సొమ్ములు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 23

Updated Date - Mar 31 , 2025 | 12:05 AM