TGRJC: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఇలా చేస్తే ఇంటర్లో ఫ్రీ సీటు
ABN , Publish Date - Mar 23 , 2025 | 10:18 AM
తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు కీలక అలర్ట్ జారీ చేసింది. గురుకుల రెసిడెన్షియల్ కాలేజీలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశాలకు సంబంధించి టీజీఆర్జేసీ-2025 నోటిఫికేషన్ విడుదల చేసింది.

తెలంగాణలో ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షలు ముగిశాయి. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ పదో తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో 2025-2026 విద్య సంవత్సరానికి గాను ఇంటర్ కోర్సుల్లో ఉచిత ప్రవేశాలకు సంబంధించి టీజీఆర్జేసీసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35 గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఉండగా.. వీటిల్లో ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంది. గురుకుల రెసిడెన్షియల్ కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులు టీజీఆర్జేసీ సెట్కు అప్లై చేసుకోవచ్చు.
ఇక ఆర్జేసీసెట్ 2025 నోటిఫికేషన్ ప్రకారం.. మార్చి 24 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు తెలంగాణ విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ గురుకుల కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులు.. ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉన్నాయి. అప్లై చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి.. వారు పొందిన మార్కుల ప్రకారం ఆయా కాలేజీల్లో, కోర్సుల్లో సీటు కేటాయిస్తారు. గురుకుల కాలేజీల్లో చేరాలనుకునే అభ్యర్థులు.. అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. మరిన్ని వివరాలకు 040-24734899 నంబర్కు కాల్ చేసి సమాచారం పొందవచ్చని సూచించింది.
ఎల్పీసెట్-2025 నోటిఫికేషన్ విడుదల
అలానే తాజాగా రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ఎల్పీసెట్ (లేటరల్ ఎంట్రీ ఇంటూ పాటికెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)2025 నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ద్వారా ఐటీఐ 60 శాతం మార్కులతో పాసైన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమాలో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశించవచ్చు. ఎల్పీసెట్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 21 నుంచి ప్రారంభం కానుంది. ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. మే 20న ఎల్పీసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ రెవెన్యూ శాఖలో 10,954 పోస్టుల భర్తికి అనుమతి
తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులు మంజూరు అయ్యాయి. మాజీ వీఆర్ఓలు, వీఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకుని ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here