Trump Decision: అమెరికా విద్యాశాఖ మూసివేత!
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:41 AM
ముఖ్యంగా సెనేట్ సమర్థించడం అనుమానమే. కోర్టులు కూడా ఈ ఆదేశాలను నిలిపివేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే, తన నిర్ణయాన్ని కాంగ్రెస్ సమర్థిస్తుందన్న విశ్వాసాన్ని ట్రంప్ వ్యక్తంచేశారు. విద్యను ఫెడరల్ ప్రభుత్వం నుంచి తప్పించి గతంలో మాదిరే విద్యావిధానాన్ని రాష్ట్రాలకు వదిలేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.

అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు
పెన్సిల్వేనియా యూనివర్సిటీకి 17.50 కోట్ల డాలర్లు నిలిపివేత
వాషింగ్టన్, మార్చి 20: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశ విద్యాశాఖను మూసివేయాలని విద్యామంత్రి లిండా మెక్మోహన్ను గురువారం ఆదేశించారు. అయితే దీనిని అమెరికా కాంగ్రెస్.. ముఖ్యంగా సెనేట్ సమర్థించడం అనుమానమే. కోర్టులు కూడా ఈ ఆదేశాలను నిలిపివేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే, తన నిర్ణయాన్ని కాంగ్రెస్ సమర్థిస్తుందన్న విశ్వాసాన్ని ట్రంప్ వ్యక్తంచేశారు. విద్యను ఫెడరల్ ప్రభుత్వం నుంచి తప్పించి గతంలో మాదిరే విద్యావిధానాన్ని రాష్ట్రాలకు వదిలేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీనిని అమలు చేస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు కూడా. దానికనుగుణంగానే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారని వైట్హౌస్ ధ్రువీకరించింది. అయితే కీలకమైన కొన్ని సేవలు, కార్యక్రమాలను కొనసాగించాలని మెక్మోహన్కు ట్రంప్ సూచించారు. ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే శాఖ సిబ్బందిలో సగాన్ని ఇప్పటికే తీసివేశారు. ఆయనపై విపక్ష డెమోక్రాటిక్ సెనేటర్ ప్యాటీ ముర్రే విరుచుకుపడ్డారు. ట్రంప్, డీవోజీఈ అధిపతి ఎలాన్ మస్క్ కలిసి విద్యార్థులు, కుటుంబాల డబ్బును దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంకోవైపు.. ట్రంప్ చర్యకు వ్యతిరేకంగా 21 రాష్ట్రాల్లో డెమోక్రాటిక్ పార్టీకి చెందిన అటార్నీ జనరల్స్ కోర్టుల్లో పిటిషన్లు వేశారు. జిమ్మీ కార్టర్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1979లో విద్యాశాఖను ఏర్పాటుచేశారు. విద్యాసంస్థలకు నిధులు, విద్యార్థులకు రుణాలు, పౌరహక్కుల అమలువంటి వాటిని ఇది పర్యవేక్షిస్తుంది.
విద్యా శాఖను రద్దుచేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని పౌర హక్కుల గ్రూపులు, విద్యాసంఘాలు హెచ్చరించాయి. ముఖ్యంగా పేద వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపాయి. ఇంకోవైపు.. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి ఫెడరల్ ప్రభుత్వం ఇవ్వాల్సిన 17.50 కోట్ల డాలర్ల నిధులను ట్రంప్ యంత్రాంగం స్తంభింపజేసింది. బాలికలు, మహిళల క్రీడల్లో ట్రాన్స్జెండర్లు పాల్గొనకుండా నిషేధిస్తూ ట్రంప్ గత నెల 5నే ఆదేశాలు జారీచేశారు. అయినా సదరు వర్సిటీలో జరిగిన ఈతల పోటీలో ట్రాన్స్జెండర్లు పాల్గొనడంతో కన్నెర్రజేశారు.
గోల్డ్ కార్డు.. ట్రంప్ కార్డు
గ్రీన్ కార్డుకు బదులుగా ట్రంప్ తెచ్చిన గోల్డ్ కార్డు(గోల్డెన్ వీసా)కు ‘ట్రంప్ కార్డు’గా నామకరణం చేస్తారని అంటున్నారు. 50 లక్షల డాలర్లు చెల్లించి గోల్డెన్ వీసా తీసుకునేవారికి పౌరసత్వ సదుపాయాలు కల్పిస్తామంటూ గత నెలలో ఆయన దీనిని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ‘ఫాక్స్ న్యూస్’ ఇంటర్వ్యూలో అధ్యక్షుడు మాట్లాడుతూ.. దీనికి తన పేరే పెట్టాలని అందరూ అంటున్నారని వ్యాఖ్యానించారు. ‘10 లక్షల గోల్డ్ కార్డులు అమ్మితే 5 లక్షల కోట్ల డాలర్ల ఆదాయం వస్తుంది. దీంతో చైనా, ఇతర దేశాలకు అప్పులన్నీ తీర్చేయొచ్చు’’ అన్నారు.
భారత్పై మస్క్ ‘ఎక్స్’ దావా
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’ (ట్విటర్) భారత్పై దావా వేసింది. కేంద్రం చట్టవిరుద్ధంగా కంటెంట్ నియంత్రిస్తోందని, ఏకపక్షంగా సెన్సార్షిప్నకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సమాచార హక్కు (ఐటీ) చట్టం ఉల్లంఘనలను ప్రస్తావిస్తూ, ప్రత్యేకించి సెక్షన్ 79(3)(బీ)ని దుర్వినియోగం చేస్తోందని, ఇది సుప్రీం కోర్టు తీర్పులను ఉల్లంఘించడమేనని పేర్కొంది. సెక్షన్ 69ఏను పక్కదారి పట్టించేలా, కంటెంట్ను బ్లాక్ చేసే వ్యవస్థను సృష్టించడానికి ప్రభుత్వం 79(3)(బీ) సెక్షన్ను ఉపయోగిస్తోందని పిటిషన్లో పేర్కొంది. మరోవైపు, మస్క్కు చెందిన ఏఐ చాట్బాట్ ‘గ్రోక్’ వివాదాస్పద కంటెంట్ వాడటంపై కేంద్రం ఆరా తీస్తోంది. కొందరు యూజర్లు అడిగిన ప్రశ్నలకు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో వివాదానికి దారి తీసింది.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..