IIPE: పెట్రోలియం వర్సిటీ పనుల్లో జాప్యం
ABN , Publish Date - Mar 22 , 2025 | 05:56 AM
వర్సిటీ భవనాల నిర్మాణానికి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో స్థలం కేటాయించినా.. నిర్మాణంలో జాప్యం జరుగుండటంతో 2016 నుంచీ ఈ సంస్థ క్యాంపస్.. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలోనే తాత్కాలికంగా నడుస్తోందని ఈ కమిటీ పేర్కొంది.

పార్లమెంటరీ కమిటీ అసంతృప్తి
ఐఐపీఈ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయండి
కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు
న్యూఢిల్లీ, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ (ఐఐపీఈ) విశ్వవిద్యాలయం ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. వర్సిటీ భవనాల నిర్మాణానికి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో స్థలం కేటాయించినా.. నిర్మాణంలో జాప్యం జరుగుండటంతో 2016 నుంచీ ఈ సంస్థ క్యాంపస్.. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలోనే తాత్కాలికంగా నడుస్తోందని ఈ కమిటీ పేర్కొంది. ఐఐపీఈ సంస్థ నిర్మాణానికి అవసరమైన 201.80 ఎకరాలను న్యాయవివాదం తర్వాత ఏపీ హై కోర్టు ఆదేశాల మేరకు మార్చి 2023లోనే అప్పగించారని, కేవలం 46 శాతం నిర్మాణ పనులే పూర్తయ్యాయని కమిటీ పేర్కొంది. ఈ సంస్థ నిర్మాణానికి డీపీఆర్ను రూపొందించే బాధ్యతను 2024 ఆగస్టులో ఈడీసీఐఎల్కు అప్పగించారని తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నందున ప్రభుత్వం 2025-26లో కేటాయింపులు చేయలేదని, 2024-25లో రూ.168 కోట్లు కేటాయించినా.. తర్వాత రూ.88 కోట్లకు తగ్గించారని కమిటీ దృష్టికి వచ్చింది. ఈ మొత్తాన్ని కూడా 2024-25లో ఉపయోగించలేదని తెలిపింది. భూసేకరణ ఆలస్యం వల్ల ఖర్చు పెరిగిందని, నిధులు కేటాయించి పనులు పూర్తయ్యేలా చూడాలని కమిటీ కేంద్రాన్ని కోరింది.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే