Revanth Reddy: ఎక్కువ నిధులిస్తూ.. తక్కువ తీసుకోవాలా?
ABN , Publish Date - Mar 23 , 2025 | 03:47 AM
దేశ ఖజానాకు దక్షిణాది పెద్ద మొత్తంలో నిధులిస్తూ తక్కువ మొత్తాన్ని పొందుతున్నదని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పన్నుల రూపంలో కేంద్రానికి తమిళనాడు రూపాయి చెల్లిస్తే 29 పైసలే వెనక్కి వస్తోంది. అదే.. యూపీకి రూపాయికి రూ.2.73; మధ్యప్రదేశ్కు రూ.1.73; బిహార్కు రూ.6.06 వెనక్కి వస్తున్నాయి.

అసమగ్ర పునర్విభజన అంగీకరించబోం: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
చెన్నై, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. దేశ ఖజానాకు దక్షిణాది పెద్ద మొత్తంలో నిధులిస్తూ తక్కువ మొత్తాన్ని పొందుతున్నదని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పన్నుల రూపంలో కేంద్రానికి తమిళనాడు రూపాయి చెల్లిస్తే 29 పైసలే వెనక్కి వస్తోంది. అదే.. యూపీకి రూపాయికి రూ.2.73; మధ్యప్రదేశ్కు రూ.1.73; బిహార్కు రూ.6.06 వెనక్కి వస్తున్నాయి. కర్ణాటకకు కేవలం 14 పైసలు, తెలంగాణకు 41 పైసలు, కేరళకు 62 పైసలు మాత్రమే వెనక్కి వస్తున్నాయి’’ అని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం కేటాయింపులు, పన్ను చెల్లింపులను క్రమంగా తగ్గిస్తోందని, చివరకు, జాతీయ ఆరోగ్య మిషన్ కేటాయింపుల్లోనూ ఉత్తరాది రాష్ట్రాలకే 60 నుంచి 65 శాతం నిధులు దక్కుతున్నాయని తప్పుబట్టారు. జనాభాను నియంత్రించాలని 1971లో కేంద్రం నిర్ణయించినప్పటి నుంచీ దక్షిణాది రాష్ట్రాలు అమలు చేశాయని, ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలు విఫలమయ్యాయని గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ వేగంగా ఆర్థిక వృద్ధిని సాధించాయని, మంచి ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాలను ఈ ప్రక్రియ శిక్షిస్తుందని తెలిపారు. దక్షిణాదిని రాజకీయంగా కుదించే ఈ పునర్విభజనను అంగీకరించలేమని, అసమగ్ర పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా బీజేపీని అడ్డుకోవాలని రేవంత్ పిలుపునిచ్చారు. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలని, అన్ని రాష్ట్రాలు, పార్టీలు తమ విభేదాలను విస్మరించి మన వాటా దక్కించుకునేందుకు ఏకతాటిపై నిలవాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణాది గళాన్ని బలంగా, సమైక్యంగా మొత్తం భారతదేశానికి వినిపించాలని సూచించారు. పునర్విభజనకు జనాభా దామాషాను ప్రాతిపదికగా చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తామన్నారు. తదుపరి జేఏసీ సమావేశం హైదరాబాద్ నిర్వహిస్తామని తెలిపారు.
దక్షిణాదికి అన్యాయమే: కేటీఆర్
పునర్విభజన వల్ల దక్షిణాదికి పార్లమెంటులో ప్రాతినిఽథ్యం తగ్గడమే కాకుండా, ఆర్థికపరమైన నిధుల కేటాయింపుల్లో కూడా తీవ్రమైన నష్టం జరుగబోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి 36 శాతం జీడీపీలో భాగస్వామ్యం వున్న దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం శిక్షిస్తోందని మండిపడ్డారు. దక్షిణాది పట్ల కేంద్రం వివక్ష కొత్తేమీ కాదని, ఇటీవలి కాలంలో ఈ వివక్ష, అన్యాయం మరింత పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం బుల్లెట్ రైళ్లను ఉత్తరాదికి పరిమితం చేస్తూ.. పుండుపైన మరింత ఉప్పు రాస్తోందన్నారు.
ఇవి కూడా చదవండి:
Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..
WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News