Share News

Waqf Bill: ముస్లింల హక్కుల పరిరక్షణకే బిల్లు

ABN , Publish Date - Apr 04 , 2025 | 04:46 AM

వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టి, దీని చర్చలో కేంద్ర మంత్రి రిజిజు ప్రతిపక్షాల విమర్శలను ఖండించారు. బిల్లు ముస్లింల హక్కులను పరిరక్షించేందుకేనని, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత పెరగనుందని తెలిపారు

Waqf Bill: ముస్లింల హక్కుల పరిరక్షణకే బిల్లు

  • ఇందులో ముస్లిమేతరుల ప్రమేయం లేదు

  • 284 సంస్థలు అభిప్రాయాలు తెలిపాయి

  • అన్ని వర్గాలనూ సంప్రదించాకే బిల్లు

  • రాజ్యసభలో వక్ఫ్‌ బిల్లుపై చర్చలో కేంద్ర మంత్రి రిజిజు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: వక్ఫ్‌ సవరణ బిల్లు-2024ను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం బుధవారం అర్ధరాత్రి దాటాక లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. 288-232 ఓట్లతో బిల్లుకు ఆమోదం లభించింది. వక్ఫ్‌ సవరణ బిల్లు-2024 (యూనిఫైడ్‌ వక్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంపవర్‌మెంట్‌, ఎఫిషియన్సీ అండ్‌ డెవల్‌పమెంట్‌ (యూఎంఈఈడీ-ఉమీద్‌)’కు లోక్‌సభ ఆమోదం తెలపడంతో కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వక్ఫ్‌ సవరణ బిల్లును చట్టవిరుద్ధమైనదిగా పేర్కొన్న ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లులో ముస్లిమేతరుల ప్రమేయం ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. ముస్లింల హక్కులను హరిస్తామన్న ప్రతిపక్షాల ఆరోపణలనూ ఖండించారు. ముస్లింల్లోని అన్ని తెగల వారి హక్కులను పరిరక్షించేందుకే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ బిల్లుతో వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ‘‘బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేముందు మేం రాష్ట్ర ప్రభుత్వాలు, మైనారిటీ కమిషన్లు, వక్ఫ్‌ బోర్డులతో సంప్రదింపులు జరిపాం. బిల్లు పరిశీలనకు జేపీసీని ఏర్పాటు చేశాం. సుదీర్ఘ చర్చ అనంతరం లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది’’ అని రిజిజు చెప్పారు. ప్రస్తుతం దేశంలో 8.72 లక్షల వక్ఫ్‌ ఆస్తు లు ఉన్నాయన్నారు.


2006లో 4.9 లక్షల వక్ఫ్‌ ఆస్తు ల ద్వారా రూ.12 వేల కోట్ల ఆదాయం వస్తుందని సచార్‌ కమిటీ అంచనా వేసిందని, అంటే ప్రస్తుతం ఆయా ఆస్తుల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో ఊహించుకోవచ్చని తెలిపారు. వక్ఫ్‌ బోర్డు ఆస్తుల నిర్వహణలో లోపాలను, దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకే ఈ సవరణ బిల్లును తెచ్చినట్లు చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని, వక్ఫ్‌ ఆస్తులన్నీ ముస్లింలకు మాత్రమే చెందుతాయని స్పష్టంచేశారు. ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా 284 సంస్థలు తమ అభిప్రాయాలను తెలిపాయని, కోటి మందికి పైగా ప్రజలు వినతిపత్రాలు అందించారని వెల్లడించారు. అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే మైనారిటీ వ్యవహారాల శాఖ ఈ సవరణ బిల్లును రూపొందించిందని రిజిజు స్పష్టం చేశారు. సభ్యులందరూ బిల్లుకు మద్దతు తెలుపుతారని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ సభ్యుడు సయ్యద్‌ నజీర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విద్వేషాలు రెచ్చగొట్టి, మతపరమైన ఏకీకరణ కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అబద్ధాల ఆధారం గా సవరణ బిల్లును రూపొందించారని, ఆరు నెలలుగా బీజేపీ వక్ఫ్‌ బిల్లుపై దుష్ప్రచారం చేసిందని ధ్వజమెత్తారు. రాజ్యసభలోనూ 8 గంటల పాటు చర్చ జరిపేందుకు అవకాశమిచ్చారు. గురువారం అర్ధరాత్రి దాటేవరకూ చర్చ జరుగుతూనే ఉంది.


gr.jpg

ముస్లిం మహిళలను ద్వితీయ శ్రేణి పౌరుల్ని చేసిన కాంగ్రెస్‌: నడ్డా

కేంద్రంలో చాలా కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ దేశంలోని ముస్లిం మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేసిందని బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభాపక్ష నేత జేపీ నడ్డా ఆరోపించారు. వక్ఫ్‌ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో ఆయన మాట్లాడారు. ట్రిపుల్‌ తలాక్‌ను నిషేధించడం ద్వారా మోదీ సర్కారు ముస్లిం మహిళలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చిందన్నారు. ఈజిప్టు, సూడాన్‌, బంగ్లాదేశ్‌, సిరియా వంటి ముస్లిం దేశాల్లో చాలా ఏళ్ల కిందటే ట్రిపుల్‌ తలాక్‌ను నిషేధించగా.. భారత్‌లో మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చేసిందేమీ లేదన్నారు. వక్ఫ్‌ ఆస్తులను ప్రభుత్వం ఏమీ తీసుకోదని, వాటి దుర్వినియోగాన్ని మాత్రమే అడ్డుకుంటుందని చెప్పారు. కాగా, కాంగ్రెస్‌ ఎంపీ సర్ఫరాజ్‌ అహ్మద్‌, శివసేన (ఉద్ధవ్‌ వర్గం) ఎంపీ సంజయ్‌ రౌత్‌ వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకించారు. ట్రంప్‌ వేస్తున్న ప్రతీకార సుంకాల నుంచి దృష్టి మరల్చేందుకే మోదీ సర్కారు వక్ఫ్‌ బిల్లు తీసుకొచ్చిందని.. అందుకే పేద ముస్లింలపై ఎనలేని ప్రేమ చూపుతోందని రౌత్‌ అన్నారు. ఇండి కూటమి సభ్యులు వక్ఫ్‌ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు అని, ముస్లింలను లక్ష్యంగా చేసుకొని రూపొందించారని ఆరోపించారు.


‘కర్ణాటకలో పాక్‌ అనుకూల నినాదాలు’.. సభలో వాగ్యుద్ధం

వక్ఫ్‌ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు రాధామోహన్‌ దాస్‌ అగర్వాల్‌ చేసిన వ్యాఖ్యలతో రాజ్యసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది. కర్ణాటకలో కాంగ్రెస్‌ నేత రాజ్యసభకు ఎన్నికైన సమయంలో ఆ పార్టీ శ్రేణులు పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారని ఆరోపించారు. ఆ నినాదాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ ఆరోపణలు తనపైనే చేశారంటూ కాంగ్రెస్‌ సభ్యుడు నజీర్‌ హుస్సేన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీజేపీ సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది.

  • వక్ఫ్‌ బిల్లును ఆమోదించడాన్ని ఆలిండియా ముస్లిం జమాత్‌ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్‌ రజ్వీ బరేల్వి స్వాగతించారు. ఈ బిల్లుతో ముస్లింల్లోని అణగారిన వర్గాలకు ఆర్థిక ఊరట లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బిల్లుకు అనుకూలంగా ఓటేసిన లోక్‌సభ సభ్యులకు, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

  • వక్ఫ్‌ బిల్లుపై బీజేడీ మాట మార్చింది. రాజ్యసభలో బీజేడీకి ఏడుగురు సభ్యులున్నారు. బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. గురువారం మాత్రం తమ సభ్యులు మనస్సాక్షి ప్రకారం ఓటు వేయొచ్చని తెలిపింది. ఎంపీలకు విప్‌ జారీ చేయబోమంది.


ఇవి కూడా చదవండి:

వక్ఫ్ చట్టం 1995 vs వక్ఫ్ సవరణ బిల్లు 2025

కులాంతర వివాహానికి సిద్ధమైందని.. సోదరినే చంపేశాడు

Updated Date - Apr 04 , 2025 | 04:46 AM